బంజారాహిల్స్, మే 2 : పోలీసులమంటూ నమ్మించి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అటకాయించడంతో పాటు విచారణ కోసమంటూ బైక్మీద ఎక్కించుకొని సెల్ఫోన్ లాక్కొని పారిపోయిన నకిలీ పోలీసులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్కు చెందిన కౌస్తబ్ ఘోష్(21) వెంకటగిరిలో నివాసముంటూ బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఓ హోటల్లో హౌజ్కీపింగ్ పనిచేస్తుంటాడు. గతనెల 30న అర్ధరాత్రి 1:50గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకున్న కౌస్తబ్ ఘోష్ ర్యాపిడో బైక్ బుక్ చేసుకొని ఎన్టీఆర్ట్రస్ట్ భవన్ దాకా వచ్చాడు.
అక్కడినుంచి నడుచుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నం 5లోని అన్నపూర్ణ స్టూడియో మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. ఊరినుంచి వచ్చిన అతడి బంధువు బిశ్వనాథ్ ఘోష్(22) కూడా అతడికి ఎదురుగా వచ్చాడు. వారిద్దరూ కలిసి వెళ్తుండగా వెనకనుంచి పల్సర్ బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని, అనుమానాస్పదంగా కనిపిస్తున్న మిమ్మల్ని విచారించాల్సి ఉందంటూ దబాయించారు. తమతో పాటు పోలీస్స్టేషన్కు రావాలంటూ వారిద్దరిని బైక్మీద ఎక్కించుకున్నారు. ఎస్ఆర్నగర్లోని పలు ప్రాంతాల్లో తిప్పిన అనంతరం వారిద్దరివద్దనుంచి మొబైల్ ఫోన్లు లాక్కొని బైక్పై పారిపోయారు.
ఈ విషయమై ఈనెల 1న బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలతో పాటు స్థానికులు ఇచ్చిన సమాచారం అధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులైన శ్యామ్లాల్కుంట వాస్తవ్యులు ఓరుగంటి నరేశ్(26), ఫ్లవర్ డెకరేషన్ వర్కర్తోపాటు వాటర్ సరఫరా వ్యాపారం చేసే శివసాయి గణేశ్(24)లను అరెస్ట్ చేశారు. వారివద్దనుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. నిందితులపై గతంలో ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలో కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది.