వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 26 : నాణ్యత గల ధాన్యాన్ని పండించాలని ఐక్యరాజ్య సమితి వ్యవసాయ విస్తరణ సాంకేతిక నిపుణులు డా. షేక్ ఎన్. మీరా అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విద్యాసంస్థ వారోత్సవాల సందర్భంగా ఆడిటోరియంలో జరిగిన సదస్సు రెండవ రోజు ఆయన మాట్లాడారు. వ్యవసాయ సంస్థలు, శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాలు డిజిటల్ విప్లవంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. నైపుణ్యత, నిరంతర శిక్షణతోనే వ్యవసాయ విస్తరణ సేవల్లో మార్పు ఆశించవచ్చని జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డా. ఆర్ వెంకట కుమార్ పేర్కొన్నారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ పడారియా మాట్లాడుతూ నూతన వ్యవసాయ శాస్త్రీయ పద్ధతులు, విస్తరణ పరిశోధనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో బెంగుళూర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. ఎస్వీ సురేషా, డా. జీవీ రామాంజనేయులు, డా. వి. సుధారాణి, డా. ఎం. జగన్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.