రవీంద్రభారతి, అక్టోబర్ 17: నవ సమాజ నిర్మాణం కవిత్వంతోనే సాధ్యమని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో బుర్రా వెంకటేశం సంపాదకుడిగా వ్యవహరించిన అనుబంధాల పూదోట సూక్ష్మకావ్య పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విశిష్ట అతిథిగా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, గౌరవ అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ టి.కిషన్రావులు విచ్చేశారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ సమాజ నిర్మాణం కుటుంబం నుంచే మొదలు కావాలని.. కుటుంబ సభ్యులు మంచిగుంటే సమాజం బాగుపడటం ఖాయమన్నారు. తెలుగు రాష్ర్టాల కవులు, కళాకారులు ఇలాంటి మంచి పుస్తకాలు రాయడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, కళాకారులు పాల్గొన్నారు.