సిటీబ్యూరో, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ప్రభుత్వమిచ్చే చేనేత చీరల పంపిణీ శనివారం నుంచి ప్రారంభమవుతుందని, దీనికి అన్ని ఏర్పాట్లు చేశామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీపై జోనల్ డిప్యూటీ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లు సమీక్షించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో 1371 రేషన్ దుకాణాలు, 838 పంపిణీ కేంద్రాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారని చెప్పారు.
ఇప్పటివరకు 8,57,600 చీరలు చేరాయని, పంపిణీ కార్యక్రమాన్ని జోనల్,డిప్యూటీ కమిషనర్లు నిర్వహిస్తారని, ప్రతి పంపిణీ కేంద్రానికి ఒక అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తారని మేయర్ వివరించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులచే చీరలను పంపిణీ చేస్తామన్నారు. ఆధార్కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు. 60 ఏండ్లు పైబడిన మహిళలు, నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు.
మేడ్చల్, నమస్తేతెలంగాణ: మేడ్చల్ జిల్లావ్యాప్తంగా 7,04,669 మంది లబ్ధిదారులను గుర్తించి నేటి నుంచి బతుకమ్మ చీరలను అందజేయనున్నారు. మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లోని 659 రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయనున్నారు. చీరల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మేడ్చల్ ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు.