సిటీబ్యరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బార్కోలేజర్ 3డీ గ్లాస్ను మొదటిసారి ప్రసాద్ ఐమ్యాక్స్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నది. అత్యాధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన అవతార్- 2 సినిమాను అంతే స్థాయిలో వీక్షించేలా ఈ 3డీ గ్లాస్ను అందించనున్నారు. శుక్రవారం విడుదలవుతున్న అవతార్ -2 సినిమాకు ఈ గ్లాసెస్ను ఉపయోగించనున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ గ్లాసెస్ను బెల్జియం నుంచి తీసుకొచ్చారు. ఒక్కో గ్లాస్(స్పెడ్స్) ధర రూ.4వేలు. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద స్క్రీన్.. ప్రపంచంలోనే అతి పొడవైన ఐమ్యాక్స్ తెరపై ఈ సినిమా ప్రదర్శన కాబోతున్నది. 630 సీటింగ్ కెపాసిటీతో స్క్రీన్ 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో భారీ తెరను ఏర్పాటు చేశారు. కెనాడాకు చెందిన ప్రొజెక్షన్ స్క్రీన్ తయారిదారు ఆస్ట్రంగ్ ఎండీఐ ద్వారా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కోసం స్క్రీన్ ప్రత్యేకంగా రూపొందించారు. స్పీకర్లు క్యూఎస్సీ ఆడియో.. ప్లేబ్యాక్ కోసం, డాల్బీ సీపీ950 సౌండ్ ప్రాసెసర్ వాడుకలో ఉంటుందని మేనేజర్ మోహన్ కుమార్ పేర్కొన్నారు. ఈ 3డీ గ్లాసెస్తోనే ప్రత్యేక అనుభూతి కలగనుందని పేర్కొన్నారు.