బేగంపేట, మార్చి 16 : బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ ప్రాంగణంలో మంగళవారం యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఆఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు సెంటర్కు చేరి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు హాజరై మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ బ్యాంక్ ఉద్యోగులు చేస్తున్న పోరాటం సరైందని అన్నారు. సోమవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మెస్తున్నామని ప్రకటించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పుచేస్తున్నదని.. వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఎలా ఏర్పాటవుతాయని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి బ్యాకుల ప్రైవేటీకరణ వల్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఉద్యోగులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చుక్కయ్య, అధ్యక్షుడు నగేశ్, సాయి ప్రసాద్, యూఎఫ్బీయూ కన్వీనర్ శ్రీరాం, అధికారులు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్బజార్, మార్చి 16 : దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్లు పేర్కొన్నారు. మంగళవారం బషీర్బాగ్లోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలనే ఆలోచనను దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు.