సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తున్నది. సిల్ డెవలప్మెంట్, సిల్ అప్గ్రేడేషన్ పేరిట శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. ఇందులోభాగంగానే లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఎల్సీఎఫ్) సంస్థతో కలిసి జీహెచ్ఎంసీ శుక్రవారం చందానగర్ బల్దియా కల్యాణ మండపంలో నిరుద్యోగ యువతకు జాబ్మేళా నిర్వహించింది. రిటైల్, బ్యాంకింగ్, లాజిస్టిక్, ఫార్మసీ, సేల్స్, ఐటీ తదితర కంపెనీలు పాల్గొనగా..200 మంది వరకు హాజరయ్యారు. 50 మంది వరకు అర్హత సాధించారు. జాబ్మేళాకు నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండడంతో మరిన్ని చోట్ల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు బల్దియా సమాయత్తమవుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 4846 కాలనీలు, 1466 మురికి వాడలు ఉండగా..వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పైలెట్ ప్రాజెక్టుగా శేరిలింగంపల్లిలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. తర్వాత హైదరాబాద్లో ఉన్న 1466 మురికివాడల్లో కూడా నెమ్మదిగా ఈ కార్యక్రమం అమలుకు సన్నద్ధమయ్యారు. ప్రతి ఏటా దాదాపుగా 600 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వీరందరికీ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. కాగా, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, వెబ్ డెవలప్మెంట్, నర్సింగ్ అసిస్టెంట్, బ్యూటీ అండ్ వెల్ నెస్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వీటితో పాటు జావా, డేటా ఎంట్రీ, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, బీపీవో వంటి ఐటీ ఆధారిత కోర్సుల్లో కూడా ట్రైనింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కోర్సులు కేవలం 3 నెలల నుంచి 6 నెలల కాలంలోనే పూర్తి చేయవచ్చు. సంస్థ నిర్దేశించిన స్థలంలో ఉచితంగా శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా ట్రైనింగ్ అందజేస్తారు. శిక్షణ ముగించిన వారికి లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సర్టిఫికెట్లు అందజేస్తుంది. సామర్థ్యాన్ని బట్టి వివిధ కంపెనీల్లో అవకాశాలు కల్పిస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వారికే ట్రైనింగ్ ఇస్తారు. విద్యార్హత, టాలెంట్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.