సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : గణేశ్ పండుగలో అత్యంత కీల క ఘట్టం లడ్డూ వేలం. నవరాత్రులు పూజలు అందుకున్న గణేశుడి లడ్డూను దక్కించుకోవడానికి భక్తులు పోటీపడుతుంటారు. ఏ లడ్డూ ఎంత ధర పలికిందోనని అందరూ ఉత్కంఠగా గమనిస్తుంటారు. అందులో భాగంగానే నగరంలో శనివారం జరిగిన వివిధ వేలం పాటల్లో పలువురు లక్షలు వెచ్చించి విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకున్నారు. లడ్డూ వేలం అనగానే మొదట గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడే. ఈ ఏడాది రూ. 35 లక్షల ధర పలికింది.
గత ఏడాది 30.01లక్షలు పలికిన బాలాపూర్ గణనాథుడి లడ్డూను ఈసారి కర్మన్ ఘాట్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి రూ. 35 లక్షలు వెచ్చించి చేజిక్కించుకున్నాడు. 1994లో 450 రూపాయల ధర పలికిన బాలాపూర్ లడ్డూ కాలక్రమేణా లక్షల రూపాయలకు చేరింది. ఇక్కడి లడ్డూ వేలం పాట డబ్బులను గ్రామీణాభివృద్ధి కోసం ఉత్సవ సమితి వెచ్చిస్తుంది. కాగా, వేలం పాట కు హాజరైన మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. బాలాపూర్లో పుట్టిన వాళ్లంతా అదృష్టవంతులేనని అన్నా రు. బాలాపూర్ గణనాథుడు కొలువుదీరిన ఈ మహేశ్వరం నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. అలాగే మాదాపూర్లోని సాయి నగర్ యూత్ అసోసియేషన్ లడ్డూ రూ. 30 లక్షల ధర పలికింది.
బండ్లగూడ జాగీర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాకు చెందిన లంబోదరుడి లడ్డూ రూ. 2.32 కోట్లు పలికింది. ఆ విల్లావాసులందరూ ఈ లడ్డూను దక్కించుకున్నారు. సాధారణంగా లడ్డూ వేలానికి ముందర విల్లాస్ నివాసితులను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. వేలంలో అన్ని గ్రూపులు పాల్గొంటాయి. ఎక్కువ ధర పలికిన గ్రూపు లడ్డూను దక్కించుకుంటుంది. మిగిలిన మూడు గ్రూప్ సభ్యులు ఎంత వరకు వేలం పాట పాడారో ఆ సొమ్మును అందిస్తారు. అలా వచ్చిన మొత్తాన్ని లడ్డూ ధరగా నిర్ణయిస్తారు. కాగా, గత ఏడాది రిచ్మండ్ విల్లా లడ్లూ 1.87 కోట్లు పలికింది. కాగా, కూకట్పల్లి బాలాజీనగర్ డివిజన్లోని గణనాథుడి లడ్డూను రూ. 10 లక్షల 20 వేలకు ఎస్. కృష్ణ నాయక్ దక్కించుకున్నాడు.