పహడీషరీఫ్, ఏప్రిల్ 7: ఉబర్ క్యాబ్లో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు సదరు క్యాబ్ డ్రైవర్పై దాడి చేసి కారుతో పారిపోయిన సంఘటన పహడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్చార్జి సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం… కంచన్బాగ్, చాంద్రాయణగుట్టలో నివాసముంటున్న మిర్జా ఆజంబేగ్ (21) ఉబర్ క్యాబ్లో పనిచేస్తున్నాడు. 6న రాత్రి 12:45 గంటల సమయంలో ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకి ప్యాసింజర్స్ డ్రాపింగ్ కోసం ఉబర్ యాప్లో లోకేషన్ పెట్టారు.
అక్కడికి వెళ్లి ఇద్దరు వ్యక్తులను కారులో ఎక్కించుకున్నాడు. ఓటీపీ చెప్పమనగా ఫోన్ ప్రాబ్లం ఉన్నదని, మార్గ మద్యలో చెప్తామన్నారు. పహడీషరీఫ్ పోలీస్స్టేషన్ దాటిన అనంతరం ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో వెనకాల కూర్చున్న వ్యక్తి మూత్రం వస్తుంది.. కారు ఆపమని కోరాడు. ఎయిర్పోర్టు దగ్గరికి వచ్చాము కదా.. అక్కడ ఆపుతానని డ్రైవర్ చెప్పగానే వెనకాల నుంచి బిగ్గరగా పట్టుకున్నాడు.
ముందు కూర్చున్న వ్యక్తి దగ్గర ఉన్న చాక్తో దాడి చేయగా డ్రైవర్ తలపై గాయమైంది. వెంటనే అతను ప్రాణభయంతో కారును ఆపగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారును తీసుకుని తుక్కుగూడ వైపు పారిపోయారు. మరో కారు డ్రైవర్ సహాయంతో మిర్జా ఆజంబేగ్ కారు యజమానికి జరిగిన విషయం చెప్పాడు. కారు యజమాని జీపీఎస్ ద్వారా కారు బేగంబజార్ ప్రాంతంలో ఆగి ఉన్నదని గుర్తించారు. బాధితుడు తన సోదరుడిని పిలిపించుకుని ఉస్మానియా దవాఖానలో చికిత్స తీసుకున్నాడు. గురువారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.