సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు సహాయ పరికరాలు, కృత్రిమ అవయవాలను త్వరలో జీహెచ్ఎంసీ ఉచితంగా పంపిణీ చేయనున్నది. బల్దియా పరిధిలో నివసిస్తున్న సీనియర్ సిటీజన్లు, దివ్యాంగులు, బీపీఎల్ ఫ్యామిలీకి చెందిన వారికి గతేడాది సర్కిల్కు ఒక క్యాంపు ఏర్పాటు చేసి ఎవరికి ఏ పరికరం, కృత్రిమ అవయవాలు అవసరమో గుర్తించి.. అందజేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించగా..వచ్చే వారంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత సర్కిల్ వారీగా గుర్తించిన అర్హులైన వారందరికీ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
4456 లబ్ధిదారులకు..
జీహెచ్ఎంసీ అలిమ్ కో సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన గుర్తింపు శిబిరాల్లో 4456 లబ్ధిదారులకు రూ.3 కోట్ల 86 లక్షల 80 వేల 286 రూపాయల విలువతో 9250 పరికరాల కొనుగోలుకు ప్రతిపాదించారు. బల్దియా ఏర్పాటు చేసిన క్యాంపులకు 837 మంది లబ్ధిదారులు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రాలేకపోయారు. అన్ని ధ్రువీకరణ పత్రాలతో శిబిరాలకు హాజరైన 4456 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 15 లక్షల 281 రూపాయల విలువ గల 7576 కృత్రిమ అవయవాలను, పరికరాలు, సహాయ పరికరాలను బల్దియా ఉచితంగా పంపిణీ చేయనున్నది.