సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): కొవిడ్కు సంబంధించి తప్పుడు రిపోర్టులు ఇచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ను శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దమ్మాయిగూడకు చెందిన దామిరెడ్డి సునీల్కుమార్ తనతో పాటు కుటుంబసభ్యులకు కరోనా లక్షణాలు ఉండటంతో తనకు పరిచయమున్న ల్యాబ్టెక్నీషియన్ కిరణ్ వద్ద ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాడు. సునీల్కుమార్కు పాజిటివ్ రాగా, అతడి కుటుంబసభ్యులకు నెగెటివ్ వచ్చిందని చెప్పి కిరణ్ ఒక్కో రిపోర్టుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేశాడు. మరోసారి సునీల్ కుమార్ తన భార్య నాగలక్ష్మి, కుమార్తె యాష్వీకి అతడి వద్దే టెస్టులు చేయించగా, వారిద్దరికీ పాజిటివ్గా రిపోర్టులు ఇచ్చాడు. దీంతో మరోసారి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయించాడు. వారి వద్ద సేకరించిన నమూనాలను మెడిక్ పాథ్ ల్యాబ్కు పంపిస్తానని చెప్పిన కిరణ్ సొంతంగానే రిపోర్టులను అందజేశారు. దీంతో అతడి తీరుపై అనుమానం కలిగిన సునీల్కుమార్ సదరు ల్యాబ్ వద్దకు వెళ్లి ఆరాతీయగా, ఆ రిపోర్టులు తమవికావని స్పష్టం చేశారు. తప్పుడు రిపోర్టుల ద్వారా ప్రాణాలకు ప్రమాదం కలిగే విధంగా వ్యవహరించడంతో పాటు రూ.18,500 ఫీజు వసూలు చేశాడంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, శుక్రవారం అతన్ని అరెస్టు చేశారు.