చార్మినార్ : రోజువారి కూలీగా పనులు చేస్తున్నా కుటుంబ పోషణ భారం కావడంతో స్నేహితులు కలిసి గంజాయి అమ్మకాలు సాగించాలని ప్లాన్ వేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కొనుగోళ్లు చేసిన గంజయిని పాతనగరంలో విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను దక్షిణ మండల టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం యాకుత్పుర ప్రాంతానికి చెందిన హుస్సేన్ (22) కూలీగా పనిచేస్తుంటాడు. ఇతనికి మీర్జా అలీ (20) అస్లం హుస్సేన్ (23) స్నేహితులు. ముగ్గురు రోజు వారి కూలీలుగా పనిచేస్తున్నారు. వారి సంపాదన కుటుంబ పోషణకు సరిపోక పోవడంతో అక్రమార్గంలో అధిక సంపాదన చేయాలని ప్లాన్ వేసుకున్నారు.
ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ నుండి అస్ఘర్ అలీ అనే వ్యక్తి నుండి గంజాయిని కొనుగోళ్లుచేసి నగరానికి తిరిగి వచ్చారు. నిందితులపై విశ్వసనీయ సమచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి కొనుగోలుదారులతోపాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుండి 5 కిలోల గంజాయితోపాటు 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను రెయిన్బజార్ పోలీసులకు అప్పగించాలమని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, శీనయ్య, నర్సింహులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.