మేడ్చల్, నవంబర్28 (నమస్తే తెలంగాణ): జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, 16 విభాగాలకు ప్రత్యేకంగా 22 మంది నోడల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల బరిలో 126 మంది అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు.
జిల్లాలో మహిళా ఓటర్లకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున 25 పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగులకు ఒకటి చొప్పున 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫొటోతో ఉన్న ఓటర్ కార్డు లేదా.. ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని సూచించారు.