జీడిమెట్ల, జనవరి 23 : హాష్ ఆయిల్ విక్రయిస్తున్న పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి సుమారు 12 లక్షల విలువ చేసే 2 లీటర్ల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయంలో బాలానగర్ జోన్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు , ఎస్ఓటీ డీసీపీ డి.శ్రీనివాస్, ఏడీసీపీ మేడ్చల్ శోభన్ కుమార్, బాలానగర్ ఏసీపీ గంగారాంలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మూసాపేట భవానీనగర్కు చెందిన అంపిలి బాలరాజు (29) ఈ నెల 12న సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామమైన శ్రీకాకుళం వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో విశాఖపట్నం (నర్సీపట్నం) ప్రాంతానికి చెందిన వందలం నాగార్జున (21) వద్ద రూ.70 వేలు వెచ్చించి 2 లీటర్ల హాష్ ఆయిల్ కొనుగోలు చేసి ఈ నెల 21న హైదరాబాద్ తీసుకువచ్చాడు.
మంగళవారం ఉదయం 1 లీటర్ హాష్ ఆయిల్ను బోయిన్ పల్లికి చెందిన మాడుగుల సతీష్ (24), బాగరి నరేశ్ (28) లకు విక్రయించాడు. వారిద్దరు హాష్ ఆయిల్ను తీసుకుని ద్విచక్రవాహనంపై మూసాపేట నుంచి వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ, సనత్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో మూసాపేట భవానీనగర్లోని బాలరాజు ఇంటిపై దాడి చేసి అతడి వద్ద నుంచి 900 మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్తో పాటు 5 ఎంఎల్ డబ్బాలో నింపి ఉన్న మరో 20 చిన్న డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, రూ.1200 స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సనత్నగర్ ఇన్స్పెక్టర్ ఎ.పురేందర్ రెడ్డి , బాలానగర్ ఎస్ఓటీ టీంను డీసీపీ అభినందించారు. నర్సీపట్నంకు చెందిన నాగార్జున పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా బాలరాజును గంజాయి కేసులో బాలానగర్ ఎక్సైజ్ , కూకట్ పల్లి పోలీసులు 2022, 2023లో జైలుకు పంపారు.