సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : జలమండలికి మరో అవార్డు వరించింది. మురుగుశుద్ధిలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందుకు, వంద శాతం మురుగునీటి శుద్ధికి ఎస్టీపీలను వేగంగా నిర్మిస్తున్నందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవార్డు దక్కింది. సనత్నగర్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్బాబుకు అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డైరెక్టర్ శ్రీధర్బాబు ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్ను అధికార బృందంతో కలిసి అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బృందాన్ని ఎండీ అభినందించారు.