అమీర్పేట్, ఏప్రిల్ 21 : ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన గొడవలో ఓ ఎనిమిదేళ్ల బాలుడు బలయ్యాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఎనిమిదేళ్ల చిన్నారిని ఇంటికి పిలిపించుకొని గొంతునులిమి హతమార్చి, ఎముకలు విరిచి పెయింట్ డబ్బాలో కుక్కి నాలాలో పడేసిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అల్లాఉద్దీన్ కోఠి బస్తీలో వెలుగు చూసింది. బాలుడి మృతికి అమావాస్య, నరబలి వంటి అంశాలు కారణం కాదని ఆర్థిక లావాలేవీలే కారణమని తేల్చి చెప్పారు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న బాలుడు దారుణ హత్యకు గురికావడంతో బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అల్లాఉద్దిన్ కోఠి బస్తీకి చెందిన ఇమ్రాన్ ఖాన్ (30) మూడేళ్ల కిందట ట్రాన్స్జెండర్గా మారి తన పేరును ఫిజాజాన్గా మార్చుకున్నాడు. ఫిజాజాన్ స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తుండటంతో బస్తీకి చెందిన చాలా మంది చిట్టీలు కట్టారు. ఇదిలా ఉండగా రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేసే వసీంఖాన్ కూడా ఫిజాజాన్ వద్ద చిట్టీలు కట్టాడు. అంతేకాకుండా కొవిడ్ సమయంలో వసీంఖాన్ నుంచి ఫిజాజాన్ పెద్దమొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నప్పటికీ ఫిజాఖాన్ డబ్బులు చెల్లించకపోవడంతో వసీంఖాన్తో నిత్యం గొడవలు జరుగుతుండేవి. గురువారం మధ్యాహ్నం ఇరువురి మధ్య గొడవ జరిగింది.
వసీంఖాన్పై కోపంతో ఫిజాజాన్ అతడి కుమారుడిని హతమార్చాలని పథకం వేసింది. రంజాన్ మాసం కావడంతో ప్రార్థనల కోసం వసీంఖాన్ కుమారుడు వహీద్ఖాన్ (8) తన ఇంటి సమీపంలో ఉండే మసీదుకు వెళ్తుండగా.. దారిలో ఎదురైన ఫిజా జాన్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తెచ్చి ఇవ్వాల్సిందిగా డబ్బులు ఇచ్చి పంపింది. వహీద్ ఖాన్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొని ఫిజా జాన్ ఇంటికి చేరాడు.
ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చేందుకు ఫిజాజాన్ ఇంట్లోకి వెళ్లిన వహీద్ఖాన్ను గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత మృతదేహం ఎముకలు ఎక్కడికక్కడ విరిచి రెండున్నర ఫీట్ల పెయింట్ డబ్బాలో కుక్కింది. వహీద్ఖాన్ను చంపిన విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు, ఎర్రగడ్డకు చెందిన ఓ ఆటో డ్రైవర్ను అద్దెకు మాట్లాడి ఇంటికి రప్పించుకున్నది. బాలుడి మృతదేహం ఉన్న పెయింట్ డబ్బాను ఓ తెల్లటి పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేసింది. ఇందులో అమావాస్య నాడు తీసిన దిష్టి తాలుక వస్తువులు ఉన్నాయని, వాటిని భద్రంగా తీసుకువెళ్లి ఏదైనా నాలాలో పడేయాలని ఆటో డ్రైవర్కు చెప్పింది. దీంతో ఆటోడ్రైవర్ పెయింట్ డబ్బాను తన ఆటోలో తీసుకువెళ్లి సనత్నగర్ సమీపంలోని జింకలవాడ నాలాలో పడేసి వెళ్లిపోయాడు.
ఫిజాజాన్ ఇచ్చిన సమాచారంతో ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న సనత్నగర్ పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు మృతదేహాన్ని గాలించేందుకు జింకలవాడకు తీసుకువెళ్లారు. దీంతో కోఠికి చెందిన పలువురు యువకులు నాలాలో మృతదేహం ఉన్న పెయింట్ డబ్బాను గుర్తించి పోలీసులకు అప్పగించారు. పెయింట్ డబ్బాను ఓపెన్చేసి చూడగా అందులో బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఇదిలా ఉండగా అల్లాఉద్దీన్ కోఠిలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఫిజాజాన్ ఇంటిని బస్తీవాసులు ధ్వంసం చేశారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బాలానగర్ డీసీపీ శ్రీనివాస్రావు తెలిపారు.
ఇదిలా ఉండగా నమాజ్ చేసుకొని వస్తానంటూ వెళ్లిన కుమారుడు వహీద్ ఖాన్ ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన వసీంఖాన్ చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టాడు. ఈ సమయంలో విషయం బయటపడకుండా ఫిజాజాన్ కూడా వసీంఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి గాలింపు చేపట్టింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో తండ్రి వసీంఖాన్ సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన సనత్నగర్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసులు బస్తీలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా తప్పిపోయిన వహీద్ ఖాన్ సాయంత్రం 5 గంటలకు ఫిజాజాన్ ఇంట్లోకి వెళ్లి తిరిగి బయటకు రాలేదు. దీంతో రాత్రి 10:30 గంటల సమయంలో ఫిజాజాన్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది.
అల్దాఉద్దీన్ కోఠిలో చోటు చేసుకున్న బాలుడు వహీద్ఖాన్ హత్య దురదృష్టకరమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.