బన్సీలాల్పేట్, డిసెంబర్ 24 : అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బన్సీలాల్పేట్ డివిజన్లోని బండమైసమ్మ నగర్ బస్తీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.26 కోట్ల వ్యయంతో 310 ఇండ్లను నిర్మించామని, బస్తీవాసుల సమక్షంలో పారదర్శకంగా అర్హులైన 245 మందికి ఇండ్లను కేటాయించామన్నారు. మిగిలిన ఇండ్లను ఎవరైన ఇండ్లు రానివారు ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం విచారణ జరిపి, త్వరలోనే లబ్ధిదారులను గుర్తించి అర్హులైన వారికి కేటాయిస్తామని తెలిపారు. పేద ప్రజలు నివసించే బండమైసమ్మ నగర్ బస్తీవాసుల ఇబ్బందులను గుర్తించి, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర సకల సదుపాయాలతో రెండు పడక గదుల ఇండ్ల కాలనీ నిర్మించడం జరిగిందన్నారు.
ఇండ్లు రాని వారిని ఒక్కొక్కరిని పేరు పేరునా వేదికపైకి పిలిచి, బస్తీవాసుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారు తగిన ఆధారాలను రెవెన్యూ అధికారులకు సమర్పించాలని కోరారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా, ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అర్హులైన వారికి మాత్రమే ఇండ్లను కేటాయించిన సంగతిని మంత్రి గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ హేమలత, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, తహసీల్దార్ శైలజ, జీహెచ్ఎంసీ ఈఈ వెంకట్దాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మిపతి, పవన్కుమార్ గౌడ్, వెంకటేశన్ రాజు, బస్తీ అధ్యక్షుడు జగదీశ్ పాల్గొన్నారు.