మణికొండ, సెప్టెంబర్ 2: మహానగర పాలక సంస్థ నుంచి కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)లో విలీనమైన ప్రాంతాల ప్రజల పరిస్థితి ప్రస్తుతం ‘అయోమయం’లో పాలన…అవస్థల్లో ప్రజలు అన్నట్లుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలీనంతో అభివృద్ధ్ది పరుగులు తీస్తుందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సమస్యల పరిష్కారానికి కూడా రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, కొన్ని ప్రాంతాలల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నా మరమ్మత్తులకు నోచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వర్షం పడితే రోడ్లపై నీరు నిలిచిపోవడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెత్త తొలగింపులో జాప్యం వంటి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని వాపోతున్నారు.
సమన్వయ లోపం..
అధికారుల మధ్య సమన్వయం లోపించడం, కొత్త పరిపాలనా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని స్థానికులు అంటున్నారు. మున్సిపాలిటీల నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోకి విలీనం చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడమే అయితే… ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రత్యేక నిధులు కేటాయించి అవసరమైన సిబ్బందిని నియమించి, ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థవంతమైన పాలన అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ నుంచి సీఎంసీగా ఏర్పాటై శివారు మున్సిపాలిటీలను నూతన కార్పొరేషన్లో విలీనం చేసి పేరు మారితే సరిపోదని పరిపాలనా సరిహద్దులకే పరిమితం కాకుండా అభివృద్ధి వెలుగులు నింపాలని స్థానికులు కోరుతున్నారు. విలీనం తర్వాత పరిస్థితులు మరింత మెరుగుపడాలి తప్ప..సమస్యలు పెరిగేలా ఉండకూదని స్పష్టం చేస్తున్నారు. విలీనమైన మున్సిపాలిటీ ప్రాంతాల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు.