మాదాపూర్, జూలై 22: మహిళలు వ్యాపార రంగాల్లో రాణించి స్వతహాగా తమ కాళ్ళపై తాము నిలబడేలా కృషి చేయాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకాంక్షించారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ైస్టెల్ తత్వ – 2023’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ విజయలక్ష్మి విచ్చేశారు. ఉమెన్ అండ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ శిఖా గోయల్, ఎఫ్ఎల్ఓ జాతీయ అధ్యక్షురాలు సుధా శివ కుమార్తో పాటు ఎఫ్ఎల్ఓ సభ్యులతో కలిసి శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలను ప్రోత్సహించేందుకు దేశంలోని నూతన మహిళా వ్యాపారులను ఒకే వేదిక పైకి తీసుకురావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలనే కాకుండా వీవర్స్ను సైతం ప్రోత్సహించేందుకు ఉచితంగా స్టాల్స్ను అందించడం సంతోషకరమన్నారు. మహిళలు తాము ఎదగడమే కాకుండా ఇతరులకు సైతం ఉపాధి కల్పించే దిశగా చేయూతనివ్వాలని అన్నారు. ఎఫ్ఎల్ఓ నేత కార్మికులకు సైతం చోటు అందించి అండగా నిలుస్తుందన్నారు.
ఫ్యాషన్ ఈవెంట్స్ సాధారణం: అడిషనల్ డీజీపీ శిఖా గోయెల్
మెట్రో నగరాల్లో లైఫ్ ైస్టెల్, ఫ్యాషన్ ఈవెంట్స్ అనేవి సర్వ సాధారణమని, ఉమెన్ అండ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ శిఖా గోయల్ అన్నారు. ప్రస్తుతం మనం గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం కారణంగా ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రత, 1.2 డిగ్రీలు పెరిగడం చూస్తున్నామన్నారు. ప్రస్తుత తరుణంలో తక్కువ నీటి వినియోగంతో అధిక శక్తిని అందించడం అవసరమన్నారు. స్థిరమైన ఫ్యాషన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆమె ఫ్యాషన్ డిజైనర్లు అందరిని కోరింది.
కార్మికులకు ఆదాయం పెంచే ప్రాజెక్టు కోసం రూ.30 లక్షలు
సుస్థిరత, నేటి ఆవశ్యకత ఇతివృత్తంగా నిలిచిందని ఎఫ్ఎల్ఓ జాతీయ అధ్యక్షురాలు సుధా శివ కుమార్ అన్నారు. నేత కార్మికుల సవాళ్ళు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళామని, ఇందులో భాగంగా చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచే ప్రాజెక్ట్ కొరకు ప్రభుత్వం రూ.30 లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. మానసిక వికలాంగులైన మహిళలు అరటి నారతో పెన్సిళ్ళు, పెన్నులు తయారు చేయడం వారి సృజనాత్మకతకు నిదర్శనమని ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్ పర్సన్ రీతూ షా అన్నారు. మనం చేసే అతి చిన్న మార్పులతోనే ఎంతో వ్యత్యాసాన్ని చూపిస్తాయని చెప్పారు.
ప్లాస్టిక్ కుళ్లిపోవడానికి వందల యేండ్లు సమయం..
మనం వాడే ప్లాస్టిక్ పెన్నులు భూమిని చుట్టేస్తాయని వక్తలు అన్నారు. మెటీరియల్ను బట్టి ప్లాస్టిక్ పెన్నులు కుళ్ళిపోవడానికి 20 నుంచి 500 సంవత్సరాల సమయం పడుతున్నదని చెప్పారు. ైస్టెల్ తత్వ ఎగ్జిబిషన్ అనేది 100 శాతం ప్లాస్టిక్ ఫ్రీ ఎగ్జిబిషన్ అని అన్నారు. ఇందులో భాగంగా సందర్శికులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 240కు పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో ఎగ్జిబిటర్ బ్యాడ్జ్లు, కాటన్, రిబ్బన్, హ్యండ్ మేడ్ పేపర్లు, వాటర్ బాటిళ్ళు, షాపింగ్ బ్యాగ్లు, కాన్వాస్ బ్యాగులు, చేతితో తయారు చేసిన ఇన్విటేషన్లు, పర్యావరణానికి అనుకూలమైన ఇంక్తో కూడిన కంపోస్టబుల్ పేపర్లతో పాటు దుస్తులు వంటి వాటిని ప్రదర్శించారు. రాష్ట్ర నలు మూలల నుంచి ఈ ప్రదర్శనను వీక్షించేందుకు రెండు రోజుల్లో కలిపి 10 నుంచి 12 వేలకు పైగా సందర్శకులు విచ్చేయనున్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు, ఎఫ్ఎల్ఓ సభ్యులు పాల్గొన్నారు.