రంగారెడ్డి జిల్లా కోర్టులు, మార్చి 21(నమస్తే తెలంగాణ): సివిల్ వివాదంలో ఘట్కేసర్ పోలీసులు తలదూర్చి పిటిషనర్ తరపు న్యాయవాది సత్యనారాయణపై తప్పుడు కేసు నమోదు చేసి అగౌరవంగా మాట్లాడిన ఘట్కేసర్ సబ్ ఇన్స్పెక్టర్ రామునాయక్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టుల న్యాయవాదులు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాది సత్యనారాయణపై అక్రమంగా కేసు నమోదు చేసిన సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీలు శ్రీధర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి న్యాయవాదులతో చర్చలు జరిపారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు గుర్రం సుధాకర్రెడ్డి, పొన్నం దేవరాజ్ గౌడ్, వేణుగోపాల్రెడ్డి, జేఏసీ కోకన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి, పీఠం ప్రదీప్కుమార్, దండెం రాంరెడ్డి, నర్సింగోజు నరేశ్కుమార్లు డీసీపీ వినతిపత్రం అందజేశారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకువెళ్తానని డీసీపీ పేర్కొన్నారు.