రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తండ్రి, కొడుకు.. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. వీరి కన్ను ఇంట్లో పనిచేసే దళిత బాలికపై పడింది. వీరిలో ఒకరు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా, మరొకరు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ కేసులో కొడుకు మేడిపల్లి భరత్కుమార్ రెడ్డి(35)కి జీవితఖైదీతోపాటు రూ.2.69 లక్షల జరిమానా, న్యాయవాదైన తండ్రి మేడిపల్లి సుధాకర్రెడ్డి(65)కి ఏడేండ్ల జైలుశిక్ష, రూ.2.59 లక్షల జరిమానా విధించారు. బాలిక కుటుంబానికి పది లక్షల పరిహారం అందజేయాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని ఆదేశిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి హరీష తీర్పునిచ్చారు. ప్రత్యేక పీపీ సునీత బర్ల కథనం ప్రకారం.. సరూర్నగర్ మండలం గ్రీన్హిల్స్కాలనీకి చెందిన న్యాయవాది సుధాకర్రెడ్డి సూర్యపేటకు చెందిన దళిత కుటుంబానికి చెందిన ఓ బాలికను తన ఇంట్లో పని చేయడానికి 2016, ఫిబ్రవరిలో తీసుకొచ్చాడు. కొద్దికాలం తరువాత ప్రథమ ముద్దాయి భరత్కుమార్రెడ్డి బాలికను భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మరో ముద్దాయి సుధాకర్రెడ్డి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కనీస అవసరాలైన బట్టలు, తిండి కూడా పెట్టకుండా.. ఇంట్లో నుంచి ఆమె బయటకు రాకుండా నిర్భందించారు. నిందితుల ఇంటికి వచ్చిన ఎలక్ట్రిషియన్ అత్యంత దయనీయంగా ఉన్న బాలికను చూసి మహిళా సంఘం ప్రతినిధులకు తెలిపాడు. సంఘం ప్రతినిధి తాడెం మహేశ్వరి గౌడ్ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పలు సాంకేతిక సాక్షాధారాలను సేకరించిన పోలీసులు కోర్టులో చార్జిషీట్తోపాటు దాఖలు చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితులిద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.