హైదరాబాద్ : నెలకు 20వేల ఉచిత తాగునీటి పథకం అమలు, పురోగతిపై గురువారం జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో ఉచిత తాగునీటి పథకానికి అర్హులైన వినియోగదారుల నీటి మీటర్ల ఏర్పాటు, నల్లా కనెక్షన్లకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచినట్లు ఎండీ దానకిశోర్ చెప్పారు. డొమెస్టిక్ వినియోగదారులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు 500 బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వచ్చే నెల 10వతేదీ వరకు డొమెస్టిక్ వినియోగదారులకు ఆధార్ అనుసంధానం, 10వ తేదీ తర్వాత మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, బల్క్ కనెక్షన్ల వినియోగదారులకు అనుసంధాన ప్రక్రియపై దృష్టి సారిస్తామని అన్నారు. డొమెస్టిక్ క్యాటగిరీలో మీటర్ లేని వినియోగదారులను గుర్తించి కొత్త మీటర్లను ఏర్పాటు చేయడంతోపాటు పనిచేయని మీటర్ల స్థానంలో కొత్తమీటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఇప్పటి వరకు డొమెస్టిక్ స్లమ్లలో మొత్తం 2,00,785 కనెక్షన్లు ఉండగా, 1,05,892 కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం పూర్తయ్యిందని ఎండీ తెలిపారు. అపార్ట్మెంట్లు, కాలనీల్లో కొత్త మీటర్ల ఏర్పాటు, ఆధార్ అనుసంధాన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు జలమండలి మేనేజర్లు, మీటర్ రీడర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సత్యనారాయణ, ఈఎన్సీ అజ్మీరా కృష్ణ, డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్కుమార్, సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు.