కాచిగూడ : ప్రమాదవశాత్తు ఇంట్లో మెట్లపై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్సై సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ, చెప్పల్బజార్ ప్రాంతానికి చెందిన వెంకట్రావు భార్య పద్మినీబాయి (59) ఈ నెల 14 వ తేదీ ఉదయం ఇంట్లో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడింది.
దీంతో పద్మినీబాయి తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పద్మినీబాయిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ పద్మినీబాయి బుధవారం మృతి చెందినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.