శాలిబండ, అక్టోబర్ 19: డిగ్రీతో పాటు ఉద్యోగం, ఉపాధి అందించే కోర్సుల పై నేటి తరం విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారని విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ అభిప్రాయపడ్డారు. డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగం పొందే బీబీఏ రిటైలింగ్ కోర్సును ఈ విద్యా సంవత్సరంలోనే సిటీ కాలేజీలో ప్రవేశపెడుతున్నామని తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నవీన్మిట్టల్ మాట్లాడారు. డిగ్రీలో ప్రవేశం పొందే సమయంలోనే విద్యార్థుల అభిరుచిని గుర్తించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. ఈ విధానంతో సాధించిన సత్ఫలితాలతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు అనువైన కోర్సులను ప్రవేశపెట్టడానికి సుదీర్ఘంగా అధ్యయనం చేశామన్నారు.
బీబీఏ రిటైలింగ్ కోర్సులకు సంబంధించిన రెజ్యుమె, క్రెడిట్స్ విషయాలపై అధ్యయన పత్రాలను పరిశీలించామని చెప్పారు. అనంతరం కళాశాల విద్యాశాఖ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. మూడు సంవత్సరాల డిగ్రీతో పాటు విద్యార్థులకు ఉపకార వేతనం, ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. దీని వల్ల విద్యాభ్యాసం పూర్తి కాగానే విద్యార్థులు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలభాస్కర్, కామర్స్ శాఖ హెడ్ రత్న ప్రభాకర్, అధ్యాపకులు మల్లిఖార్జున్, శ్రీధర్ పాల్గొన్నారు.