చాంద్రాయణ గుట్ట, డిసెంబర్ 17 : పాతనగరంలోని బండ్లగూడలో పెద్దశబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. బాంబు పేలుడు జరిగిందని చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ వృద్ధునికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. బర్మా దేశానికి చెందిన హమీద్ హుస్సేన్ (55), నగరానికి వచ్చి కొంత కాలంగా బాలాపూర్ రాయల్ కాలనీలో ఉంటున్నాడు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం బండ్లగూడలో క్రిస్టల్ టౌన్షిఫ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చిత్తు కాగితాలు ఏరుకుంటుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది.
చుట్టుపక్కల ఇండ్లకు సంబంధించిన కిటికీలు పగిలిపోయాయి.చి త్తు కాగితాలు ఏరుకుంటున్న హుస్సేన్కు తీవ్రగాయాలు అయ్యాయి. విస్పోటనం జరిగిన తీరుకు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన బండ్లగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తీవ్రంగా గాయపడిన హుస్సేన్ను వైద్యశాలకు తరలించారు. పేలుడుకు గల కారణాలు ఏమై ఉంటాయి. అసలు ఏ పదార్థం కారణంగా పేలుడు సంభవించి ఉంటుంది అనే కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసును బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.