చిక్కడపల్లి, ఫిబ్రవరి 2: ముషీరాబాద్లోని అజామాబాద్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్న ఎంఎస్ డెకరేషన్ గోదాంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 13 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారుల కథనం ప్రకారం.. రవీందర్ సింగ్ కొంతకాలంగా వీఎస్టీ సమీపంలో ఎంఎస్ డెకరేషన్ గోదాంను నిర్వహిస్తున్నాడు.
గురువారం తెల్లవారుజామున 5.20 గంటల ప్రాంతంలో గోదాంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. డెకరేషన్ పనులకు ఉపయోగించే బట్టలు, ఫైబర్, థర్మాకోల్ వంటి వస్తువులు ఉండటంతో మంటలు కొద్ది సేపటిలోనే గోదాం మొత్తం వ్యాపించాయి. పక్కనే ఉన్న సుగుణ మెటల్స్ కార్యాలయానికి, సుగుణ హరి ఫెర్రో అల్లాయన్స్కు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ముషీరాబాద్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు వెంటనే సిబ్బందితో పాటు అక్కడి చేరుకున్నారు.
ముషీరాబాద్ ఫైర్ స్టేషన్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 13 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బందితోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) కు సంబంధించిన నాలుగు టీమ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ ప్రమాదంతో వీఎస్టీ చౌరస్తా వద్ద మూడు గంటలపాటు రోడ్డును మూసి వేశారు. ఫైర్ శాఖ అడిషనల్ డైరెక్టర్ జి.వి. నారాయణరావు, డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న కుమార్, రీజినల్ ఆఫీసర్ పాపయ్య, డీఎఫ్ ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏడీఎఫ్ఓ జి.వి.ప్రసాద్, డీఆర్ఎఫ్ డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్, డీఐ పిడమర్తి నరేశ్ , ఎస్ఐలు సకాలంలో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు 60 లక్షల వరకు నష్టం జరిగినట్టు తెలుస్తుందని పోలీసులు తెలిపారు.