సుల్తాన్బజార్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా చలానాలు చెల్లించకుండా పోలీసుల కళ్ళుగప్పి తిరుగు తున్న ఓ ద్విచక్రవానదారుడిని సుల్తాన్బజార్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని బుధవారం వాహనాన్ని సీజ్ చేశారు.ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సుమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వాహనాన్ని పట్టుకున్న సమయాల్లో రాజకీయ నాయకులతో ఫోన్ చేయించడం, వెళ్లిపోవడం చేసేవాడని, అలా గత మూడేండ్లుగా పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్న వాహనాన్ని పట్టుకున్నట్లు తెలిపారు.
అఫ్జల్గంజ్ వద్ద ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ గోపాల్లు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో భవానినగర్, ఈదిబజార్కు చెందిన అబ్ధుల్ రహమాన్ (27)ద్విచక్ర వాహనం (టీఎస్11ఈఎల్5838) పై వెళుతున్నాడు. ఈ సంధర్భంగా రహమాన్ను ఆపి తనిఖీ చేయగా 2019 నుండి ఇప్పటి వరకు 88 చలానాలు 28 వేల 110 రూపాయలు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని సీజ్ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాహనాలపై ఉన్న నెంబర్ ప్లేట్స్పై ఉన్న నెంబర్ సరిగ్గా కనిపించకుండా టాంపరింగ్ చేయడం, స్టిక్కర్స్, మాస్కులు పెట్టడం వంటివి చేస్తే ఎంవీ యాక్ట్ ప్రకారం 420 ఐపీసీ సెక్షన్ కింద కేసుల నమోదు చేసి ఆ వాహనాలను స్వాధీనం చేసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.