వృద్ధుడికి పదేండ్ల జైలు శిక్ష విధింపు
రంగారెడ్డి జిల్లా కోర్టులుమార్చ్ 16,: పదేండ్ల బాలికపై అఘాయిత్యం చేసిన 70 ఏండ్ల వృద్ధుడికి పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ..రంగారెడ్డి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తిరుపతి తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. అల్వాల్ ప్రశాంత్నగర్కు చెందిన బాలిక(10) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నది. 2018 సెప్టంబర్ 26న టీచర్ ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’పై విద్యార్థులకు బోధిస్తుండగా, ఆ బాలిక ఏడుస్తూ.. పక్కింట్లో ఉండే యేసురత్నం తనపై చేసిన అఘాయిత్యాన్ని చెప్పింది. టీచర్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేశారు. కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు యేసురత్నంకు జైలుశిక్ష విధించింది.