EV Buses | సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : కాలుష్యాన్ని నివారించి.. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు మరిన్ని ఈ- బస్సులను తీసుకొస్తున్నది గ్రేటర్ ఆర్టీసీ. వచ్చే మార్చి నాటికి దశల వారీగా 640 ఎలక్ట్రిక్ బస్సులు సిటీ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. అందులో 620 నాన్ ఏసీలు కాగా, మిగతావి ఏసీ సర్వీసులు. తొలుత జూన్ నాటికి 28 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించనున్నారు. సెప్టెంబర్ వరకు 137, డిసెంబర్ నాటికల్లా 205, మిగిలినవి మార్చికల్లా అందుబాటులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో నగరంలో భారీగా శబ్ద, వాయు కాలుష్యం తగ్గనున్నది. విద్యుత్ బస్సులకు రెండు గంటలు చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. తొలుత గుర్తించిన డిపోల్లో 33 కేవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఎలక్ట్రిక్ సర్వీసులు అందుబాటులోకి రాగానే ప్రస్తుతం నడుస్తున్న కాలం చెల్లిన 300 బస్సులను తుక్కు కింద పరిగణిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో నగరంలో వాయు కాలుష్యంతోపాటు ధ్వని కాలుష్యం కూడా బాగా తగ్గిపోనున్నది. గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై త్వరలో 640 విద్యుత్ బస్సులు రయ్ రయ్ మంటూ దూసుకుపోనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ బస్సులు నగరానికి చేరుకోనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ బస్సులు ఒకేసారి కాకుండా విడుతల వారీగా నగరానికి చేరుకోబోతున్నాయి. అయితే ఈ జూన్ నాటికి తొలుత 28 బస్సులు, సెప్టెంబర్కు 137, డిసెంబర్ వరకు 205 బస్సులు సిటీకి ఈవీ బస్సులు వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మిగిలిన 270 బస్సులు వచ్చే ఏడాది మార్చి లోగా ఆర్టీసీకి అప్పగించే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. సిటీకి వచ్చే 640 విద్యుత్ బస్సుల్లో 620 బస్సులు నాన్ ఏసీగా రూపొందిస్తున్నారు. మరో 20 బస్సులు మాత్రం ఏసీగా మార్పులు చేసి, ఎయిర్పోర్టు మార్గంలో నడిపించడానికి ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో ఎయిర్పోర్టుకు తిరిగే పుష్పక్ ఈవీ బస్సుల సంఖ్య 60కి చేరుకుంటుంది.
తుక్కు కింద 300 బస్సులు..
నగరానికి 640 విద్యుత్ బస్సులు వచ్చి రాగానే ప్రస్తుతం నడుస్తున్న 300 సిటీ బస్సులను తుక్కు కింద పరిగణించనున్నారు. సిటీలో దాదాపు 15 ఏండ్ల నుంచి కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు. దీంతో ఆ బస్సులన్ని కూడా కాలం చెల్లినవిగా ఉన్నాయి. దీంతో ఆ బస్సుల ద్వారా వాయు కాలుష్యంతోపాటు ధ్వని కాలుష్యం తీవ్రంగా ఉండేది. విద్యుత్ బస్సులతో ఆర్టీసీ బస్సులకు ఆ సమస్య తీరుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో 340 సిటీ బస్సులను కొత్త మార్గాలు అన్వేషించి.. ఆయా మార్గాల్లో నడిపించే ఆలోచనలు చేస్తున్నారు. రోజు రోజుకు నగరం నలుమూలలు విస్తరిస్తున్న నేపథ్యంలో కండిషన్లో ఉన్న సిటీ బస్సులను కొత్త మార్గాల్లో నడిపించాలని భావిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.యాదగిరి తెలిపారు. ఈ క్రమంలో కొత్త మార్గాల కోసం సర్వే కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండు గంటల చార్జింగ్కు 200 కిలో మీటర్లు..
విద్యుత్ బస్సులకు రెండు గంటల చార్జింగ్ చేస్తే.. 200 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు విద్యుత్ బస్సులను రూపొందిస్తున్నారు. ఈ మేరకు డీజిల్ నిర్వహణ ఖర్చులు కూడా బాగా తగ్గనున్నాయి. చార్జింగ్ కోసం డిపోల్లో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్, మియాపూర్ డిపోల్లో 11కేవీ చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. వాటిని అవసరాలకు అనుగుణంగా 33 కేవీ కెపాసిటీకి పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. 640 బస్సులు వచ్చిన తర్వాత దాదాపు సిటీలో అన్ని డిపోల్లో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.