హైదరాబాద్: తెలంగాణలో అంతరించి పోతున్న పురాతన చేతి వృత్తిని కాపాడుతున్న కృష్ణకు, మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆయనకు అవసరమైన సహాయాన్ని అందించాలని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కార్యదర్శికి సూచించారు. హైదరాబాద్లోని అబిడ్స్కు చెందిన 55 ఏండ్ల పీ కృష్ణ, అంతరించిపోతున్న బ్లాక్ ప్రింటింగ్ సంప్రదాయాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. కరోనా సంక్షోభంలో చిన్న తరహా పరిశ్రమలు కుదేలైనప్పటికీ ఆయన ఈ చేతి వృత్తిని వీడలేదు.
శతాబ్దాల నాటి బ్లాక్ ప్రింటింగ్ కళను సజీవంగా ఉంచుతున్న తెలంగాణాలోని అతి కొద్ది మంది వ్యక్తులలో కృష్ణ ఒకరు. హస్త కళాకారులకు తీసిపోని ఈ వృత్తిలోకి ఆయన ప్రవేశించి 25 ఏండ్లు దాటింది. స్వచ్ఛమైన పట్టు, కాటన్ ఫ్యాబ్రిక్స్పై క్లిష్టమైన, ఆకర్షణనీయమైన డిజైన్లను తన చేతితో అద్భుతంగా సృష్టిస్తారు. దీని కోసం ఆయన ఎంతో శ్రమిస్తారు. హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఫాబ్రిక్ను తయారు చేయడానికి కొన్నిసార్లు చాలా గంటలు లేదా రోజుల తరపడి పని చేస్తారు.
ఈ చీరల ప్రింటింగ్కు బయట మార్కెట్లో వేలల్లో తీసుకుంటారు. కానీ, ఇప్పటికీ కృష్ణ రూ.300కే హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు. ఒక ఆర్డర్కు సుమారు రూ.150 మాత్రమే ఆయన సంపాదిస్తారు. ‘హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చీర లేదా ఏదైనా ఫాబ్రిక్ మార్కెట్లో రూ.1,000కి అమ్ముతున్నారు. నేను దానిని కేవలం రూ.300కే అమ్ముతున్నాను. నేను నెలకు ఐదు కంటే ఎక్కువ ఆర్డర్లను స్వీకరించను’ అని కృష్ణ తెలిపారు. దీంతో ఆయన నెలంతా కష్టపడినా వెయ్యి అయినా సంపాదించలేకపోతున్నారు.
ప్రింటింగ్ మెషీన్ల రాకతో ఈ వృత్తి ఇప్పుడు స్తంభించిపోయిందని కృష్ణ చెప్పారు. తనలాంటి వారు కొందరు మాత్రమే ఈ పురాతన హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ను కొనసాగిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు 55 ఏండ్ల కృష్ణను కరోనా మహమ్మారి కుదిపేసింది. ఆర్డర్లు లేక ఆయన సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.
కాగా, కృష్ణ కష్టాల గురించి తెలుసుకున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు ఆయనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సెక్రటరీకి ఆయనను కనెక్ట్ చేశారు. దీంతో తన కష్టాలు తీరుతాయని కృష్ణ ఆశిస్తున్నారు.
పురాతన చేతి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కృష్ణకు మనం కూడా అండగా నిలువవచ్చు. ఈ పండుగ సీజన్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్కు ఆర్డర్లు ఇచ్చి ఆయనను ఆదుకోవచ్చు. వివరాల కోసం 83091 81998 మొబైల్ నంబర్లో కృష్ణను సంప్రదించవచ్చు.