మాదాపూర్, ఆగస్ట్ 4: టీఎస్ ఐ పాస్ కింద తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో 24 వేల కంపెనీల ప్రతిపాదనలను ఆమోదించినట్లు టీఎస్ఐఐసీ, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఈ.వెంకట్ నర్సింహారెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో భారతదేశంలో 3వ అతి పెద్ద ప్లాస్టిక్ ఎక్స్ పో హిప్లెక్స్ 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఐఐసీ వీసీ, ఎండీ ఈ. వెంకట్ నర్సింహారెడ్డి విచ్చేసి ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషన్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ డి.చంద్ర శేఖర్, హెచ్ఎంఈఎల్ ఎండీ, సీఈఓ ప్రభుదాస్, గెయిల్ మార్కెటింగ్ పెట్రో కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ, ఇండియన్ ప్లాస్టిక్స్ ఇనిస్టిట్యూట్ సౌత్ జాతీయ అధ్యక్షుడు అనీల్రెడ్డి వెన్నం, ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయదేవ్లతో కలిసి శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహార పరిశ్రమలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వాహణ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్లపై జీఎస్టీని తగ్గించాలన్నారు. టీఎస్ ఐ పాస్ చట్టం రాష్ట్ర ప్రభుత్వ, పరిశ్రమల స్థాపనకు అవసరమైన వివిధ లైసెన్సుల జారీకి వేగవంతమైన ప్రాసెసింగ్ను అందిస్తున్నదని, గత ఎనిమిదిన్నర ఏండ్లలో 24 వేల పరిశ్రమల ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు.
ఇందులో భాగంగా మొదటి ప్లాస్టిక్ పార్క్ పూర్తిగా అమ్ముడు పోగా, రెండోది కావాలంటే టీఎస్ఐఐసీ భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. ఎంఎస్ఎంఈలకు వసతి కల్పించేందుకు వీలుగా కేటాయింపు మొదలైన వాటికి సంబంధించిన అన్ని సమస్యలను టీఏపీఎంసీ అభివృద్ధి చేయగలదని భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం, ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషన్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ డి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ, హైదరాబాద్ ప్లాస్టిక్ పరిశ్రమలకు హబ్గా ఉన్నదన్నారు. ప్రపంచంలో ప్లాస్టిక్ అనేది సమస్య కాదని, వాటిని పారవేయడమే పెద్ద సమస్యగా మారుతుందని హెచ్ఎంఈఎల్ ఎండీ, సీఈఓ ప్రభుదాస్ అన్నారు. ప్లాస్టిక్ నుంచి వాటిల్లే విపత్తును పరిష్కరించడానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ను రీసైకిల్ చేయడం తిరిగి ఉపయోగించడమే సరైన మార్గమన్నారు. దక్షణ భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమకు తాప్మా మార్గదర్శకం చూపుతుందని గెయిల్ మార్కెటింగ్ పెట్రో కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ అన్నారు. యుఎస్ఏలో చైనా తరువాత భారతదేశం 3వ అతి పెద్ద ప్లాస్టిక్ వినియోగదారుగా 6 నుంచి 7 శాతం నిరంతరం వృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్పై విధించిన 18 శాతం జీఎస్టీని తగ్గించాలని ఏఐపీఎంఏ, టీఏఏపీఎంఏఎస్ తరుపున ఆయన ప్రభుత్వాన్ని కోరినట్లు అనిల్రెడ్డి వెన్నం తెలిపారు. ఆహార ప్యాకేజింగ్ పరిశ్రమతో పాటు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్లపై విధించిన జీఎస్టీని తగ్గించడాన్ని జీఎస్టీ కౌన్సిల్ అభ్యర్థనను పరిగణించాలన్నారు.