సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ):ఎవరైనా.. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే.. వారిని సాధ్యమైనంత తక్కువ సమయంలో వైద్యశాలకు తరలించాలి. అయితే మనకెందుకులే అని కొందరనుకుంటే.. మరికొందరేమో మొబైల్లో ఫొటోలు, వీడియో తీయడం చేస్తుంటారు. కానీ ఏ ఒక్కరూ ధైర్యం చేసి క్షతగాత్రుడి ప్రాణాలను కాపాడుదాం.. అంబులెన్స్ను పిలుద్దామన్న ఆలోచన చేయడం లేదు. అయ్యో పాపం అంటూ ..ఏ సాయమూ చేయకుండానే ముందుకు సాగిపోతున్నారు. అలాంటి వందల మందిలో కొందరు మాత్రం బాధ్యతగా వ్యవహరించారు. ‘గోల్డెన్ అవర్’ లో దవాఖానకు తరలిస్తే బతుకుతారనే స్పృహతో బాధితుల ప్రాణాలు నిలుపగలిగారు. ఆ ఉత్తమ పౌరులైన 21 మందిని ‘గుడ్ సమారిటన్స్’గా గుర్తించారు సైబరాబాద్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు. వారికి రివార్డులు, ప్రశంసాపత్రాల కోసం కేంద్ర రవాణా శాఖకు లేఖలు రాశారు.
రోడ్డు ప్రమాదం జరిగింది..క్షతగాత్రుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నారు. వందల మంది అది చూసుకుంటూ వెళ్తున్నారు. కొంత మంది మొబైల్ ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కానీ ఏ ఒక్కరూ ధైర్యం చేసి క్షతగాత్రుడి ప్రాణాలను కాపాడుదాం..అంబులెన్స్ను పిలుద్దామని ఆలోచన చేయడం లేదు. అయ్యో పాపం అంటూ ముందుకు సాగిపోతున్నారు. కనీసం డయల్ 100, 108కు గాని ఫోన్లు చేయలేదు. ఆ వందల మందిలో కొంత మందికి మాత్రం పౌరులుగా బాధ్యత గుర్తొచ్చింది. అరే వారిని ‘గోల్డెన్ అవర్’ లో దవాఖానకు తరలిస్తే బతుకుతారనే స్పృహ ఉంది. ఆ ఉత్తమ పౌరులు వారు వెళ్లే పనికి ఆలస్యమైనా ఫర్వాలేదు.
ఒకరి ప్రాణాన్ని కాపాడుదామనే కర్తవ్యంతో ముందుకు రావడంతో రెండు నెలలో 21 మంది క్షతగాతులు ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వీరి చేరికను ఆలస్యం చేసి ఉంటే ఆ కుటుంబాల్లో విషాదం నిండిపోయి ఉండేది. ఆ కుటుంబాలు తీవ్రమైన శోకంలో మునిగిపోయేవారు. బాధ్యత గల వారు సరైన సమయంలో స్పందించడంతో ఆ కుటుంబాల్లో సంతోషాలు నిండి ఉన్నాయి. ఇలా ప్రమాదం జరిగిన మొదటి గంటలో క్షతగాత్రులను దవాఖానకు తరలించిన పౌరులను ‘గుడ్ సమారిటన్స్’ గా గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రివార్డులు, ప్రశంస పత్రాలను అందించేందుకు లేఖలు రాశారు. వీరి స్ఫూర్తి మరికొందరిలో చైతన్యం కలిగించి రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని గోల్డెన్ అవర్లో తరలించే విధంగా బాధ్యతను పెంచాలని కోరుకుందాం.
విద్యార్థి ముందుకు వచ్చాడు..
రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టింది. అతను రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన విద్యార్థి అస్లాం గాయపడిన వ్యాపారిని ముందుగా చందానగర్ దవాఖానకు తరలించి ప్రమాదం విషయాన్ని పోలీసులకు అందించారు.
బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది..
రోడ్డు ప్రమాదానికి గురై ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉన్నాడు. అతనికి తల నుంచి తీవ్రంగా రక్తం కారుతుంది. అది చూసి అందరూ భయపడ్డారు. మనోహర్ అనే విద్యార్థి వెంటనే గాయపడిన వ్యక్తిని కేపీహెచ్బీ పరిధిలోని ప్రైవేటు దవాఖానకు ఆటోలో తరలించాడు. సమయానికి దవాఖానకు తీసుకువెళ్లడంతో గాయపడిన వ్యక్తి మెదడులో రక్తం గడ్డకట్టకుండా చికిత్సలు చేశారు. ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
అయ్యో.. దవాఖానకు పంపిద్దాం..
ద్విచక్రవాహనం నడిపిస్తూ వాహనదారుడు రోడ్డుపై ఏదో అడ్డం రాగానే గందరగోళానికి గురై కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమై అపస్మారకస్థితిలో పడిపోయాడు. కొందరేమో చనిపోయాడని, మరికొందరేమో పోలీసులు చూసుకుంటారని ఉండిపోయారు. ఇంతలో శేరిలింగంపల్లి సర్కిల్-20కి చెందిన అరోళ్ల బాలరాజు వెంటనే స్పందించి ఆటోలో గాయపడిన వ్యక్తిని దవాఖానకు పంపించాడు. ఆరు రోజుల వైద్య చికిత్సలతో అతను బతికాడు.
‘గోల్డెన్ అవర్’లో స్పందించారు.. ప్రమాద కారకుడిని పట్టించారు..
మియాపూర్లో రోడ్డు దాటుతున్న ఓ పాదచారుడిని వాహనదారుడు ఢీకొట్టాడు. అతనికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న డెలివరీ బాయ్ అర్బాజ్ ఖాన్, విద్యార్థిని సాయిప్రియ వెంటనే 108కు సమాచారాన్ని ఇచ్చి గాయపడిన వ్యక్తిని మదీనాగూడ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని ఆపారు. గాయపడిన వ్యక్తి 9 రోజుల పాటు చికిత్స పొంది ఇంటికి క్షేమంగా వెళ్లాడు.
పోలీసుల పరేషాన్లు లేవు..
రోడ్డు ప్రమాదాల వారిని పోలీసులు రాకముందే దవాఖానకు తరలిస్తే ఆ తర్వాత పోలీసుల నుంచి సమస్యలు ఉంటాయనే అపోహను ఈ ఉత్తమ పౌరులు పటాపంచలు చేశారు. పోలీసుల పరేషాన్లు ఏమి ఉండవని వీరు చేసిన ప్రయత్నంతో తేలిపోయింది. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడడం ముఖ్యం. ఆ తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు చూసుకుంటారు. ఇలా ఈ 21 మంది ముందుగా క్షతగాత్రులను తరలించి ఆ తర్వాత సమాచారాన్ని పోలీసులు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉత్తమ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమాచారం తీసుకుని కేసుల దర్యాప్తును కొనసాగించారు.
ఢీకొట్టి వెళ్లిపోయాడు..
పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అదే సమయంలో రోడ్డు దాటుతున్న ఆటో డ్రైవర్ జోగు స్వామి వెంటనే గాయపడిన వ్యక్తిని మరో ఆటోలో స్థానిక ప్రైవేటు దవాఖానకు తరలించారు. 7 రోజుల తర్వాత చికిత్స పొంది ఆరోగ్యంగా మారాడు.
రక్తపు మడుగులో వాహనదారుడు..
దుండిగల్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. చాలా మంది వాహనదారులు చూసుకుంటూ వెళ్లారు. అదే మార్గంలో వెళ్తున్న గ్రానైట్ వ్యాపారి రవి ఇది చూసి ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆటోలో దవాఖానకు తరలించారు. 6 రోజుల వైద్య చికిత్సల తర్వాత ఆరోగ్యం మెరుగుపడింది.
సర్పంచ్ స్పందించాడు..
తాళ్లకొండపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై ఓ వాహనదారుడు తీవ్రమైన గాయాలతో పడి ఉన్నాడు. చాలామంది చూసుకుంటూ వెళ్తున్నారు తప్పా..సహాయానికి ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో తుమ్మలకుంట సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ అదే దారిలో వెళ్తుండగా గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్లో స్థానిక దవాఖానకు తరలించారు. వైద్య చికిత్సల అనంతరం గాయపడిన వ్యక్తి ఆరోగ్యం నిలదొక్కుకున్నాడు.
బండి మీద నుంచి పడ్డాడు..
బాచుపల్లి ప్రాంతంలోని ఆర్ఎస్సీ వద్ద ఓ ద్విచక్రవాహనదారుడిని మరో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అదే సమయంలో పోలీసు కానిస్టేబుల్ మాత్రి అంజయ్య గాయపడిన యువకుడిని కేపీహెచ్బీ ప్రాంతంలోని దవాఖానకు ప్రైవేటు వాహనంలో తరలించాడు. తలకు తీవ్రమైన శస్త్ర చికిత్సలు జరిగిన తర్వాత ఆ యువకుడు ఆరోగ్యంగా కోలుకున్నాడు.
బస్సు ప్రయాణంలో యాక్సిడెంట్..
బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు దిగే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ రోడ్డులో వెళ్తున్న మల్లు సాయికృష్ణ, రాజశేఖర్రెడ్డి గాయపడిన వ్యక్తిని వెంటనే మదీనాగూడ దవాఖానకు తరలించారు. వైద్యులు అత్యవసరంగా శస్త్ర చికిత్సలు చేయడంతో 15 రోజుల్లో రికవరీ అయి క్షతగాత్రుడు ఆరోగ్యంగా ఇంటికి వచ్చేశాడు.
సెల్ఫ్ స్కిడ్..
దుండిగల్ ప్రాంతంలో ఓ వాహనదారుడు సెల్ఫ్ స్కిడ్ అయ్యాడు. అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు తప్పా ఎవరూ ముందుకు రాలేదు. అదే దారిలో వెళ్తున్న ఫార్మా ఉద్యోగి రఘు రవీందర్ వెంటనే వాహనదారుడిని సూరారంలోని స్థానిక దవాఖానకు ఆటోలో తరలించాడు. వాహనదారుడు 12 రోజుల వైద్య చికిత్సల అనంతరం ఆరోగ్యం నిలకడగా మారింది.
భార్యభర్తలు కాపాడారు..
కూకట్పల్లి ప్రాంతంలో ఓ వాహనదారుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ దారిలో వెళ్తున్న తురగతి రమేశ్, అనిత భార్యభర్తలు వెంటనే ఆ వ్యక్తిని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లి నీళ్లు, టీ ఇచ్చారు. 108కు సమాచారం అందించి, అతని కుమారుడికి సమాచారం అందించి మోటర్ సైకిల్పై స్థానిక దవాఖానకు తరలించారు. 5 రోజుల పాటు వైద్య సేవలు అందిన తర్వాత ఆరోగ్యం నిలకడగా మారింది.
సాక్షి సంతకం పెట్టే అవసరం లేదు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఎంత తొందరగా దవాఖానకు తరలిస్తే అంత మంచిది. గోల్డెన్ అవర్లో హాస్పిటల్కు చేరితేనే ప్రాణాలు నిలబడతాయి. కాబట్టీ పౌరులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు కనపడగానే వారిని ముందుగా దవాఖానకు తరలించండి. అందుబాటులో ఉండే రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. 108, 100కు సమాచారం ఇవ్వండి. 5 నుంచి 10 నిమిషాల్లో మేము వస్తాం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని దవాఖానకు తరలిస్తే వారిని ఫిర్యాదు ఇవ్వమని వేధించం..సాక్షిగా సంతకం పెట్టమని కూడా అడగం. రోడ్డు మీద గాయపడిన వారిని చూసుకుంటు వెళ్లకుండా బాధ్యత గల పౌరులుగా వ్యవహరించండి.
– శ్రీనివాస్రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం, అదనపు డీసీపీ
ఫిర్యాదు ఇవ్వమని వేధించం..
క్షతగాత్రులను కాపాడిన వారిని ఫిర్యాదు ఇవ్వమని వేధించం..సాక్షిగా సంతకం పెట్టమని కూడా అడగం. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడితే బాధ్యతగా వ్యవహరించండి. అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఉత్తమ పౌరులుగా గుర్తింపు పొందండి.
–శ్రీనివాస్రెడ్డి, అదనపు డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం