సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా తర్వాత సైబరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. రెండేండ్లుగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండడంతో రోడ్ల మీద ట్రాఫిక్ కనపడలేదు. కొద్ది రోజులుగా 40 శాతం కంపెనీల్లో కార్యాలయాల నుంచి పని ప్రారంభించడంతో ఉద్యోగుల రాకపోకలు మొదలయ్యాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో ఐటీ కంపెనీలు క్యాబ్లతో ఉన్న ట్రాన్స్పోర్టు అగ్రిమెంట్లు రద్దు చేసుకున్నాయి. కరోనా కన్నా ముందు సైబరాబాద్ ఐటీ కారిడార్లో మొత్తం 33 వేల క్యాబ్లు తిరిగేవి.
కరోనా తరువాత ఆ సంఖ్య 8 వేలకు పడిపోయింది. అంటే దాదాపు 25 వేల క్యాబ్లు ఐటీ కారిడార్లో నడవడం లేదు. ఈ క్రమంలోనే కరోనా జాగ్రత్తల్లో భాగంగా చాలా మంది ఉద్యోగులు సొంత వాహనాల్లో వస్తున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య పెరగకున్నా రోడ్లపై ట్రాఫిక్ భారీగా కనపడుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలో సైబరాబాద్ ఐటీ కారిడార్ మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, నార్సింగి, రాయదుర్గం, కేపీహెచ్బీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ కనిపిస్తోంది. ఐటీ కారిడార్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల హాజరును పరిశీలిస్తే అన్ని వాహనాలను కలుపుకుని రోజుకు 50వేలకు పైగా రాకపోకలు సాగిస్తున్నాయని ఓ అంచనా. అదే పూర్తిగా కార్యాలయాలు తెరుచుకుంటే వాహనాల సంఖ్య దాదాపు లక్ష దాటుతుందని ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
ముందస్తు ప్రణాళిక..
సైబరాబాద్ ఐటీ కారిడార్తో పాటు నివాస ప్రాంతాలు విస్తృతంగా పెరగడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేకంగా కొంత మంది ట్రాఫిక్ అధికారులకు బాధ్యతలు అప్పగించి అధ్యయనం చేయించారు. అదే విధంగా ప్రభుత్వం కూడా ఐటీ కారిడార్లో ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా వివిధ ప్రాజెక్ట్ల కింద దాదాపు 17 కొత్త లింక్ రోడ్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లింక్ రోడ్డులతో ఇప్పటి వరకు ఉన్న ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ భారం తగ్గి వాహనదారులు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
రద్దీ తక్కువ..సమయం ఆదా..
గతంలో ఈ పాత జంక్షన్ల మార్గాలను ఉపయోగించే వాహనదారులు ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొత్త లింక్ రోడ్డులను ఉపయోగించుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు కోరుతున్నారు. దీని వల్ల వాహనదారులకు ట్రాఫిక్ రద్దీ బెడద తీరడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది.
ఇవే ఐటీ కారిడార్లోని 17 లింక్ రోడ్డులు..
1. కొండాపూర్ ఆర్టీవో ఆఫీసు న్యూ రోడ్డు – రైల్వే అండర్ బ్రిడ్జి (కూకట్పల్లి) -5 కి.మీ.
2. కొండాపూర్ వయా ఖానామెట్ – యశోద దవాఖాన ఎమ్ఎమ్టీఎస్ రోడ్డు – 4 కి.మీ.
3. గచ్చిబౌలి – ఏఐజీ హాస్పిటల్ రోడ్డు – 2.9 కి.మీ.
4. లెదర్ ఫ్యాక్టరీ – జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 51 – 2.7 కి.మీ.
5. న్యాయవిహార్ – జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 51 – 2.2 కి.మీ.
6. ఖాజాగూడ (మల్కం చెరువు) – చిత్రపురి కాలనీ – 3.2 కి.మీ.
7. సన్షైన్ హస్పిటల్ – చిత్రపురి కాలనీ, ల్యాంకో హిల్స్ రోడ్డు – 4.5 కి.మీ.
8. కేర్ హస్పిటల్ – నానక్రాంగూడ రోటరీ అండ్ ఓఆర్ఆర్ రోడ్డు – 4.7 కి.మీ.
9. ఒక్రిడ్జ్ స్కూల్ – కేర్ హస్పిటల్/ఓల్డ్ ముంబయి హైవే – 2.8 కి.మీ.
10. హెరిటేజ్ జంక్షన్ – మై హోం మంగళ మంజీరా పైప్లైన్ రోడ్డు -4 కి.మీ.
11. హెచ్టీ లైన్ జంక్షన్ – మజీద్ బండ – 1.2 కి.మీ.
12. ఐసీఐసీఐ బ్యాంక్ జంక్షన్ – వన్ వెస్ట్ జంక్షన్ – 2 కి.మీ.
13. ఆర్టీవో ఆఫీసు – నోవాటెల్ – 1.4 కి.మీ.
14. నిజాంపేట్ ఎక్స్ రోడ్డు – హైటెక్స్ – 3.5 కి.మీ.
15. తులసీనగర్ ఎక్స్ రోడ్డు (నిజాంపేట్ హెచ్టీ లైన్ రోడ్డు) – మయూరీనగర్, మియాపూర్ – 3 కి.మీ.
16. హైదర్నగర్(ఎన్హెచ్-65) – నిజాంపేట్ హెచ్టీ లైన్ రోడ్డు – 2 కి.మీ.
17. మూసాపేట్ – ఫోర్త్ ఫేజ్ మసీదు (పైప్లైన్ రోడ్డు) – 2.5 కి.మీ.