Hyderabad | సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): మోకిలలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల కొనుగోలుకు మంచి స్పందన వచ్చిందని హెచ్ఎండీఏ కార్యదర్శి పి.చంద్రయ్య తెలిపారు. శుక్రవారం మోకిలలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. మోకిలలో 165.37 ఎకరాల్లో అభివృద్ధి చేసిన భారీ లేఅవుట్లో హెచ్ఎండీఏ కల్పిస్తున్న మౌలిక వసతులు, ప్లాట్ల వివరాలను అధికారులు కొనుగోలుదారులకు వివరించారు.
ఈ సందర్భంగా హెచ్ఎండీఏ కార్యదర్శి పి.చంద్రయ్య మాట్లాడుతూ.. మోకిల భారీ లేఅవుట్ ఐటీ కారిడార్లోకి అత్యంత కీలకమైన కోకాపేటకు సమీపంలో, మెహిదీపట్నం-శంకర్పల్లి 100 అడుగుల రోడ్డును ఆనుకొని ఉందని, కేవలం 20 నిమిషాల్లోనే కోకాపేట నియోపోలిస్ లేఅవుట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గండిపేట పార్కు, సీబీఐటీ, ఓషియన్ పార్కు వంటి ప్రాంతాలను చేరుకోవచ్చన్నారు. వెస్ట్ సిటీ హబ్గా ఉన్న మోకిల లేఅవుట్లో మొత్తం 1321 ప్లాట్లు ఉంటాయని, చదరం గజం ధరను రూ.25వేలుగా నిర్ణయించామని, ఆన్లైన్ వేలంలో గజానికి రూ.500 చొప్పున పెంచాల్సి ఉంటుందని, ఎవరు ఎక్కువ ధర కోట్ చేస్తే ప్లాటును వారికి ఆన్లైన్లోనే కేటాయిస్తామని తెలిపారు. మొదటి దశలో భాగంగా 50 ప్లాట్లను వేలం ప్రక్రియ ద్వారా విక్రయిస్తున్నామన్నారు. హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ బి.కిషన్రావు మాట్లాడుతూ.. ఎలాంటి భూవివాదాలు లేని స్థలాల్లోనే హెచ్ఎండీఏ ప్రణాళికాబద్ధంగా లేఅవుట్లను చేశామని, కొనుగోలు చేసిన వెంటనే ఇండ్ల నిర్మాణానికి వీలు ఉండేలా అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. లేఅవుట్ సమగ్ర సమాచారాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆన్లైన్ వేలం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ పరంజ్యోతి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అప్పారావు, ఎస్టేట్ మానిటరింగ్ యూనిట్ అధికారి శ్రీకాంత్రెడ్డి, ఎంఎస్టీసీ అధికారులు పాల్గొన్నారు.