కొండాపూర్, జూన్ 28: మాదక ద్రవ్యాలను విక్రయించినా, సరఫరా చేసినా 10 ఏండ్ల పాటు జైలు శిక్ష పడుతుందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ సూపరింటెండెంట్ మురళీ కృష్ణ అన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినం సందర్భంగా బుధవారం కొండాపూర్లోని శరత్ సిటీ మాల్లో గ్రాన్యుల్స్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలను చైతన్య పరిచేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీ కృష్ణ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వాడకంతో కలిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ తీవ్రమైన ఈ అంశంపై మార్గనిర్దేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం మాదక ద్రవ్యాల అంశంపై అవగాహన కలిగించేందుకు వీధి నాటకాలతోపాటు పాటలు పాడి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రాన్యుల్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖేశ్ సురాణా, గ్రాన్యుల్స్ సీనియర్ మెడికల్ అధికారి దీప్తీ సరోజినీ తదితరులు పాల్గొన్నారు.