ఖైరతాబాద్, జూన్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితోనే విద్యుత్ రంగంలో పురోభివృద్ధి సాధించామని, దేశంలోనే విద్యుదుత్పత్తిలో రాష్ట్రం టాప్లో ఉందని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిష్కృతమైన తర్వాత 2014 జూన్ 5న మొదటి రివ్యూ విద్యుత్ రంగంపైనే చేశారన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్కు గాను ఈ నెల మార్చి నాటికి పీక్ డిమాండ్ 15,497 మెగావాట్లు సాధించామన్నారు. నేడు రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారిందంటే నాణ్యమైన నిరంతరం విద్యుత్ కారణమన్నారు.
అన్ని రంగాల్లో విశేష ప్రగతి..
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సవాళ్లను ఎదుర్కొంటూ ఒక్కొక్కటిగా సాధించుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో విశేష ప్రగతి సాధించామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు. థర్మల్, హైడల్, సోలార్ తదితర వాటి ద్వారా 7,778 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 18,567 మెగావాట్లకు చేరిందన్నారు. తొమ్మిదేండ్లలో సంస్థ పంపిణీ వ్యవస్థ మెరుగుపర్చడం కోసం రూ.14,063 కోట్లు రూపాయలు వెచ్చించామన్నారు. నూతనంగా 578 33/11కేవీ సబ్స్టేషన్లు, 5,777 కిలోమీటర్ల 13 కేవీ నెట్వర్క్, 42,474 11కేవీ లైన్లు, 1365 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 2.69లక్షల డ్రిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 4,93,322 వ్యవసాయ కనెక్షన్లు, 2014లో 15.210 కోట్ల రెవెన్యూ డిమాండ్ ఉండగా, నేడు 30.477 కోట్లకు పెరిగిందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో నేడు నిరంతర నాణ్యమైన విద్యుత్ సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్ల కార్పొరేటర్లు సంగీతాయాదవ్, మన్నె కవిత, వెల్దండ వెంకటేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్న, బీఆర్ఎస్ సోమాజిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎస్కె అహ్మద్, నాయకులు మహేశ్ యాదవ్, కర్నాటి నాగేశ్వర్ రావు, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.