అమీర్పేట్, మే 20: ఏడున్నర ఎకరాల్లోని సనత్నగర్ ఈఎస్ఐ హరిశ్చంద్ర ఘాట్ ఆధునికంగా తీర్చిదిద్దనున్నది బల్దియా. జీవవైవిధ్యం ఉట్టి పడేలా పక్షుల కిలకిలరావాలు, ఎపుగా పెరిగే పచ్చని చెట్లతో పాటు ఆహ్లాదాన్ని పంచే రంగు రంగు పూల మొక్కలతో చక్కటి మెమోరియల్ పార్క్కు రూపకల్పన చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చొరవతో ఈ శ్మశానవాటిక అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజురవ్వగా, అధికారులు ఇప్పటికే రూపొందించిన ప్రణాళికలను మంత్రి సమీక్షించారు.
సనత్నగర్ ఈఎస్ఐ శ్మశానవాటికకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా.. కూకట్పల్లి, బంజారాహిల్స్ వంటి దూర ప్రాంతాల నుంచి కూడా శవ దహనాలకు వస్తుంటారు. ఏడున్నర ఎకరాల మేరకు విశాలమైన స్థలమున్నా.. ఏర్పాట్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. రూ. 5 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనుల్లో భాగంగా ఆధునిక దహన వాటికలు రూపుదిద్దుకోనున్నాయి. ఇక్కడ జరిగే దహన క్రియలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. విశ్రాంతి గదులు, పూజాది కార్యక్రమాలు జరుపుకొనేందుకు వీలుగా గదులు, అనువైన స్థలాలు, అస్తికలు భద్రపర్చుకునే ఏర్పాట్లు, కోల్డ్ స్టోరేజ్, పరిపాలనా భవనం, పెద్దసంఖ్యలో స్నానపు గదులు, మరుగుదొడ్లను నిర్మించనున్నారు. శ్మశానవాటిక నలు దిశలా చక్కటి సీసీ రోడ్ల నిర్మాణాలు, అనువైన పార్కింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
గుర్తుండిపోయేలా మెమోరియల్ పార్క్..
శ్మశానానికి వస్తే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. అటువంటి వైరాగ్య వాతావరణానికి పూర్తి భిన్నంగా ఈఎస్ఐ శ్మశానవాటికలో చక్కటి మెమోరియల్ పార్క్కు జీహెచ్ఎంసీ అధికారులు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంజినీరింగ్, అర్బన్ బయో డైవర్సిటీ, ఎలక్ట్రికల్, శానిటేషన్ విభాగం అధికారులు రూపొందించిన నమూనాలను మంత్రి తలసాని పరిశీలించారు. ఇక్కడ నిర్మితమవుతున్న మెమోరియల్ పార్క్ సందర్శకులకు గుర్తుండిపోయేలా రూపుదిద్దుకుంటుందని, ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమై, ఏడాది లోపు పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.