36 మంది పండితులతో 5 రోజులు యజ్ఞం
మహాశివరాత్రి సందర్భంగా రేపు పూర్ణాహుతి
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో పవిత్ర కాశీ మహాక్షేత్రంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న మహా రుద్రయాగం గురువారం మహాశివరాత్రి సందర్భంగా పరిసమాప్తం కానున్నది. శృంగేరి శారదాపీఠ పండితులు వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ, విరివింటి ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో దాదాపు 36 మంది మహా వేదపండితులు ఈ మహారుద్రయాగాన్ని నిర్వహిస్తున్నారు. సమస్త లోకకల్యాణం కోసం.. తెలంగాణ ప్రజల సుఖశాంతులను ఆకాంక్షిస్తూ.. పరమేశ్వరుడి సన్నిధానంలో ఈ మహా యజ్ఞాన్ని తలపెట్టామని గోపీకృష్ణ శర్మ తెలిపారు. 1400 రుద్ర పారాయణాలు పూర్తిచేసి.. మహాశివరాత్రి పర్వదినాన రుద్రాధ్యాయ మంత్రానుష్ఠానం చేసి.. పూర్ణాహుతి నిర్వహిస్తామని వివరించారు.