మనం నిద్రపోతున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా..ఊపిరితిత్తులు మాత్రం అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటాయి. నిరంతరం ఆక్సిజన్ను తీసుకుంటూ, కార్బన్ డై ఆక్సైడ్ను బయటికి పంపుతూ మనం జీవించి ఉండేందుకు దోహదపడతాయి. ఇంత కీలకమైన ఊపిరితిత్తుల్లో హానికారక కణాలు అపరిమితంగా పెరిగి.. ‘లంగ్ క్యాన్సర్’కు దారితీస్తాయి. ఇందుకు ప్రధాన కారణం పొగ తాగడం, పొగాకు వాడకంతోపాటు పొగ తాగే వారి పక్కన ఉండటం.
ఊపిరితిత్తులకు హానిచేసే సిగరెట్లలో 4,000కు పైగా రసాయనాలు ఉంటాయి. అందులో 60కి పైగా క్యాన్సర్ కారకాలే. ఒకప్పుడు విపరీతంగా పొగతాగి మానేసిన వారిలోనూ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వారి కుటుంబసభ్యులకూ అంతే ముప్పు పొంచి ఉంటుంది. సిగరెట్, బీడీలు కాల్చడం, పొగాకు నమలడం.. ఇలా పొగాకు ఉత్పత్తులను ఏ రూపంలో వాడినా క్యాన్సర్ వచ్చే ముప్పు దాదాపు 20% ఎక్కువ. మిగతా శరీర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్లకు ఎక్కువ. రేడాన్ గ్యాస్, అస్బెస్టాస్, వాతావరణ కాలుష్యం, తాగేనీటిలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉండటం కూడా.. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయి.
సాధారణ లక్షణాలు
వైద్యపరీక్షలు.. నిర్ధారణ
లక్షణాలు ఉన్నవారికి ముందుగా ఛాతీ ఎక్స్రేతోపాటు బయాప్సీ, సీటీ స్కాన్, పెట్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేస్తారు. కళ్లె(తెమడ)ను పరీక్షించడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును తెలిపే స్పైరోమెట్రీ, ఊపిరితిత్తులను ఎండోస్కోపీ పద్ధతిలో పరీక్షించే బ్రాంకో స్కోపీ, రక్తపరీక్షల వంటివి చేస్తారు. ఊపిరితిత్తుల్లోని ఏ ప్రాంతంలో క్యాన్సర్ వచ్చింది? ఏ దశలో ఉన్నది? గ్రేడ్ ఎలా ఉంది? అనేది నిర్ధారణ చేసి, చికిత్స మొదలుపెడతారు.
చికిత్స ప్రక్రియలు :
క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే లోబెక్టమీ చేసి, క్యాన్సర్ వచ్చిన భాగాన్ని తొలగిస్తారు. నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్కు సర్జరీ చేస్తారు. ఎక్కువగా వ్యాప్తిచెందే స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అయితే రేడియో థెరపీ, కీమో ఎంతకాలంపాటు తీసుకోవాలో నిర్ణయిస్తారు. వయసు పెద్దదై, క్యాన్సర్ను చివరి దశలో గుర్తిస్తే తీవ్రతను తగ్గించి, వారు బతికి ఉన్నంతకాలం ఉపశమనం కలగడానికి ‘పాలియేటివ్ కేర్’ అందిస్తారు.
లంగ్ క్యాన్సర్ నివారణ :
పొగ తాగడమే ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం. కాబట్టి నివారణ మన చేతుల్లోనే ఉంది. పొగ తాగడానికీ, అలాగే స్మోకింగ్ చేసేవారికి దూరంగా ఉండటంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని తగ్గించగలిగితే.. చాలావరకు మన ఊపిరితిత్తులు పదిలంగా ఉన్నట్టే!
నిర్ధారణలో పొరబాట్లు వద్దు..
ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ లక్షణాలు ఒకేరకంగా ఉంటాయి. దీంతో చాలామంది పొరబడి, తప్పుడు చికిత్స అందించే ప్రమాదం ఉంటుంది. క్షయ వ్యాధి దేహంలో ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉన్నా ఊపిరితిత్తులకే ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే టీబీ.. దగ్గు ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఎక్కువ. క్షయ వ్యాధి ఉన్నవారికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా పక్కనున్న వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత అయినా, వారిలో రోగనిరోధక శక్తి బాగా తగ్గినప్పుడు వ్యాధి బయటపడవచ్చు. క్యాన్సర్ ఉన్నవారికి ఇచ్చే థెరపీలతో రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది.
కాబట్టి, టీబీకి ఇంతకుముందు గురైనా, టీబీతో బాధపడుతున్న వారికి దగ్గరలో ఉన్నా.. టీబీ, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, ఇక్కడ పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు ముందుగా సరైన నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, అది టీబీ అయినా, క్యాన్సర్ అయినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా మేరకు నిర్ణీతకాలం పాటు చికిత్స తీసుకోవడం మంచిది. ఒకవేళ క్యాన్సర్ అయితే.. చికిత్స పూర్తిగా ముగిసిపోయాక కూడా వైద్యుల సలహా మేరకు కొన్నాళ్లపాటు ఫాలోఅప్ తప్పనిసరి.
-డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421