Toothbrush | అందమైన దంతాల వరుస కావాలన్నా.. దంతాలు మిల మిలలాడుతూ మెరవాలన్నా.. ఎవరైనా ఏం చేయాలి? దంతాలను సరిగ్గా తోమాలి. శుభ్రం చేసుకోవాలి. అంతే..! కానీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అధిక శాతం మంది దంతాలను సరిగ్గా తోమడం లేదట. నిత్యం రెండు సార్లు దంతధావనం చేయాలని డెంటిస్టులు చెబుతున్నా, కనీసం ఒక్కసారి తోమినప్పుడు కూడా దంతాలను ఎవరూ సరిగ్గా శుభ్రం చేసుకోవడం లేదట. దీని వల్ల అనేక దంత సమస్యల బారిన పడాల్సి వస్తుందని వారు అంటున్నారు. ఈ క్రమంలో దంత సంరక్షణ కోసం ఉపయోగించే టూత్బ్రష్ పట్ల కూడా కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్లను మాత్రమే వాడాలి. ఎందుకంటే హార్డ్ బ్రిజిల్స్ దంతాలకు, చిగుళ్లకు హాని కలిగిస్తాయి. కాబట్టి సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ అని రాసి ఉన్న టూత్బ్రష్లను మాత్రమే వాడాలి. కనీసం 3, 4 నెలలకోసారి అయినా టూత్ బ్రష్లను మార్చాలి. లేదంటే వాటిలో బాక్టీరియా పెరిగిపోయి అవి నేరుగా మన జీర్ణాశయంలోకి వెళ్లి ఇతర అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. అయితే ఫ్లూ జ్వరం, దగ్గు, జలుబు వంటివి వచ్చినప్పుడు కూడా టూత్బ్రష్లను మార్చాలి. ఎందుకంటే అవి తగ్గాక కూడా బాక్టీరియా ఆ బ్రష్లలో అలాగే ఉంటుంది. దీంతో మళ్లీ మనకు ఆ అనారోగ్యాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. చాలా మందికి టూత్బ్రష్లను బాత్రూంలలో పెట్టడం అలవాటు. అయితే ఆ అలవాటును ఇప్పుడైనా మానండి. ఎందుకంటే బాత్రూంలలో ఉండే హానికరమైన బాక్టీరియా మన టూత్బ్రష్ల పైకి సులభంగా చేరుతుంది. దీని వల్ల కూడా మన ఆరోగ్యం చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాష్రూంలలో టూత్బ్రష్లను ఉంచకూడదు.
ఒకే బాక్స్లో అన్ని టూత్బ్రష్లను కూడా ఉంచకూడదు. లేదంటే ఇతరుల బ్రష్లలో ఉండే బాక్టీరియా మన బ్రష్లపై కూడా చేరేందుకు అవకాశం ఉంటుంది. మన నోట్లో ఎల్లప్పుడూ 200 నుంచి 500 రకాల బాక్టీరియా నివాసం ఉంటుందట. దీన్ని నివారించాలంటే రోజుకి కనీసం 2 సార్లు, ప్రతి సారి 2 నిమిషాల పాటు దంతాలను తోముకోవాలట. అలా తోముకోకపోతే బాక్టీరియా మొత్తం అలాగే ఉండి నోటి దుర్వాసన, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి. టూత్బ్రష్పై ఎలాంటి క్యాప్ ఉంచకూడదు. దీని వల్ల బ్రిజిల్స్పై బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది మన దంతాలకు సమస్యలను కలగజేస్తుంది. ఇక ఓ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో అధిక శాతం మంది నిత్యం 45 నుంచి 70 సెకండ్లలోపే దంతాలను తోమడం ముగించేస్తారని తేలింది. కానీ తప్పనిసరిగా 2 నిమిషాల పాటు దంతాలను తోమాల్సిందేనని దంత వైద్యులు చెబుతున్నారు.
ఇక పురుషుల కంటే మహిళలే ఎక్కువ సేపు దంతాలను శుభ్రం చేసుకుంటారని కూడా సర్వేలు చెబుతున్నాయి. అలాగే 1959లో అమెరికాలో మొదటిసారిగా ఎలక్ట్రిక్ టూత్బ్రష్ను తయారు చేశారు. 1850వ సంవత్సరం వరకు టూత్పౌడర్నే ఎక్కువగా ఉపయోగించేవారు. టూత్పేస్ట్లు అప్పుడు లేవు. కాగా కోల్గేట్ సంస్థ 1873లో తొలిసారిగా టూత్పేస్ట్ను తయారు చేసింది. అప్పుడు ఆ సంస్థ దాన్ని జార్లలో అందించేది. అనంతరం 1890లో ఇప్పుడున్న మాదిరిగా అప్పుడు ట్యూబ్లు వచ్చాయి. అప్పటి నుంచి ట్యూబ్లలోనే టూత్పేస్ట్ను అందిస్తున్నారు. ఇక 1945 వరకు టూత్పేస్ట్లలో సబ్బు ప్రధాన పదార్థంగా ఉండేది. సోడియం లారైల్ సల్ఫేట్ అనే రసాయనాన్ని అప్పుడు సబ్బుకు బదులుగా టూత్పేస్ట్లలో వాడడం మొదలుపెట్టారు. 1956లో ఫ్లోరైడ్తో కూడిన మొదటి టూత్పేస్ట్ను తయారు చేశారు. ఇక బ్లూ, రెడ్ రంగుల్లో ఉండే టూత్బ్రష్లను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.