Vitamin D | ఎముకల బలానికి, శరీర ఆరోగ్యానికి విటమిన్ డి అవసరమని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. 30-40 ఏళ్ల వయసులో శరీరంలో ఉన్న విటమిన్ డి స్థాయిలు, 60-70 ఏళ్ల వయసులో మెదడు ఆరోగ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంటే ఇప్పుడు ఉన్న విటమిన్ డి లోపం భవిష్యత్తులో మెదడు క్షీణత, జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి సమస్యలకు కారణం అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. న్యూరాలజీ ఓపెన్ యాక్సెస్ అనే జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో దాదాపు 800 మందిని 16 సంవత్సరాల పాటు పరిశీలించారు. పరిశోధకులు గుర్తించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మధ్య వయస్సులో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో, వృద్ధాప్యంలో మెదడులో టావ్ (Tau) ప్రోటీన్ స్థాయిలు తక్కువగా కనిపించాయి. ఈ టావ్ ప్రోటీన్ అసాధారణంగా గుంపులుగా చేరితే మెదడులో టాంగిల్స్ ఏర్పడతాయి. ఇవి అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ టాంగిల్స్ నాడీకణాలను దెబ్బతీసి మెదడు క్షీణతకు దారితీస్తాయి.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, విటమిన్ డి మెదడుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది నాడీకణాల మధ్య జరిగే హానికర మార్పులను తగ్గించి, మెదడు వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుంది. అందుకే సరైన స్థాయిలో విటమిన్ డి ఉండడం భవిష్యత్తులో జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గించడంలో కీలకంగా మారుతోంది. ఇక భారతదేశం సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే దేశం అయినప్పటికీ, విటమిన్ డి లోపం పెద్ద సమస్యగా మారింది. జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, దేశంలోని 70 శాతం నుంచి 90 శాతం మంది వరకు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఎక్కువ సమయం ఇంటి లోపల గడపడం, కాలుష్యం పెరగడం, చర్మంలో మెలనిన్ అధికంగా ఉండటం వల్ల సూర్యరశ్మి నుంచి విటమిన్ డి తక్కువగా ఉత్పత్తి కావడం వంటి వాటిని విటమిన్ డి లోపం తలెత్తడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
అలాగే హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) నిర్వహించిన మరో అధ్యయనంలో కూడా విటమిన్ డి తక్కువగా ఉన్న మధ్యవయస్కులలో మెదడు పనితీరు తగ్గినట్లు గుర్తించారు. నిపుణులు 30-40 ఏళ్ల వయస్సును గోల్డెన్ విండోగా అభివర్ణిస్తున్నారు. ఈ దశలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో మెదడు క్షీణత ప్రమాదాన్ని తగ్గించవచ్చని వారు చెబుతున్నారు. వయసులో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, విటమిన్ డి లోపం ప్రభావం నెమ్మదిగా కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడే అవకాశం ఉంది. అందుకే ముందుగానే జాగ్రత్తలు అవసరం.
కనుక ముందు నుండే విటమిన్ డి స్థాయిలను మెరుగుపరుచుకోవాలి. విటమిన్ డి పరీక్షలు చేయించుకోవాలి. 25-హైడ్రాక్సీ విటమిన్ డి రక్తపరీక్ష ద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయిలను తెలుసుకోవచ్చు. వారంలో కనీసం మూడు రోజులు, మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట మధ్య 15-20 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం మంచిది. ఫ్యాటీ ఫిష్, ఫోర్టిఫైడ్ పాలు వంటి ఆహారాలను తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ డి3 సప్లిమెంట్లు తీసుకోవాలి. విటమిన్ డి కేవలం ఎముకల ఆరోగ్యానికే కాదు, భవిష్యత్తులో మెదడు ఆరోగ్యానికి కూడా కీలకమని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. చిన్న వయస్సులో తీసుకునే జాగ్రత్తలు వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుతాయి. అందుకే విటమిన్ డి స్థాయిలను నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.