Summer Natural Drinks | వేసవి తీవ్రత పెరిగినప్పుడల్లా వేసవి పానీయాలను గుర్తు చేసుకుంటారు. చల్లదనం కోసం ఐస్ లాటేలు, కృత్రిమ రంగులతో ఉన్న సోడా డ్రింక్స్ కాదు, నేల నుంచే వచ్చిన సహజ పానీయాలే ఉత్తమం. పచ్చి మామిడి, పుదీనా కలిపిన పానీయం నుంచి జీలకర్ర, కరివేపాకుతో చేసిన మజ్జిగ వరకు.. ప్రతి ప్రాంతానికీ ప్రత్యేకమైన వేసవి పానీయాలు ఉన్నాయి. ఇవి ఆయుర్వేద సూత్రాలపై ఆధారపడి, స్థానిక వాతావరణానికి అనుగుణంగా రూపుదిద్దుకుని తరతరాలుగా లభిస్తున్నాయి. దేశంలో వేసవి కాలంలో ఎక్కువగా తయారు చేసే అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని వేసవి పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమ్ పన్నాను ఉత్తర భారత్ లో ఎక్కువగా తయారు చేస్తారు. పచ్చి మామిడితో చేసే ఈ పానీయం వేసవిలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది పుల్లగా, చల్లగా ఉండి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ ను అందిస్తుంది. ఎండ దెబ్బ నుంచి రక్షణ కలిగించడంలో ఇది సహాయపడుతుంది. జల్జీరాను రాజస్థాన్, ఉత్తర భారత్ లో ఎక్కువగా తయారు చేస్తారు. జీలకర్ర, చింతపండు, పుదీనా కలిపి తయారు చేసే ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం ముందు తాగితే ఆకలి పెరుగుతుంది, వేసవిలో శరీరానికి చల్లదనం ఇస్తుంది. అలాగే రాజస్థాన్, యూపీల్లో ఠండాయిని ఎక్కువగా తయారు చేస్తారు. పాలు, బాదం, సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఠండాయి శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా పోషకాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా పండుగల సమయంలో ఎక్కువగా తీసుకుంటారు.
సత్తు షర్బత్ బిహార్, యూపీల్లో ఎక్కువగా తయారు చేసే పానీయం. సత్తు (వేపిన శనగ పిండి)తో చేసే ఈ పానీయం ప్రోటీన్, ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచి, ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతుంది. అదే విధంగా మహారాష్ట్ర, గోవాల్లో కోకమ్ షర్బత్ ను ఎక్కువగా తయారు చేస్తారు. కోకమ్ పండుతో చేసే ఈ పానీయం గులాబీ రంగులో ఉండి, జీర్ణాశయంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు కూడా మంచిది. ఇక దేశవ్యాప్తంగా చేసే పానీయాల్లో మజ్జిగ / చాస్ ఒకటి. మజ్జిగ భారతదేశంలో ప్రతి ప్రాంతంలో కనిపించే సాధారణ పానీయం. ఇది ప్రోబయోటిక్ గుణాలు కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీలకర్ర, అల్లం వంటి పదార్థాలతో కలిపితే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది.
వేసవిలో ఎక్కువగా తయారు చేసే పానీయాల్లో బేల్ షర్బత్ కూడా ఒకటి. దీనిని తూర్పు భారత్ లో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. బేల్ పండుతో చేసే ఈ పానీయం సహజంగా తీపిగా ఉండి శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో ఇది శక్తినిస్తుంది. నన్నారి షర్బత్ ను దక్షిణ భారత్ లో తయారు చేస్తూ ఉంటారు. నన్నారి వేరు నుంచి తయారయ్యే ఈ పానీయం శరీరానికి చల్లదనం ఇచ్చి, చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొంకణ్ ప్రాంతంలో సోల్కడీనీ ఎక్కువగా తయారు చేస్తారు. కొబ్బరి పాలు, కోకమ్ కలిపి చేసే ఈ పానీయాన్ని భోజనం తర్వాత తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరానికి తక్షణ చల్లదనం ఇస్తుంది. నుంగు షర్బత్ ను తమిళనాడు, కేరళలో తయారు చేస్తూ ఉంటారు. తాటి ముంజలు (ఐస్ ఆపిల్)తో చేసే ఈ పానీయం సహజంగా తీపిగా ఉండి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇలా దేశంలోని ఈ సంప్రదాయ వేసవి పానీయాలు కేవలం దాహం తీర్చడానికే కాదు, శరీరాన్ని లోపల నుంచి చల్లబరచడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రాసెస్డ్ డ్రింక్స్ కంటే ఇవి ఆరోగ్యకరమైన ఎంపికలు. ఎండ ఎక్కువగా అనిపించినప్పుడు ఈ సహజ పానీయాలను తాగడం మంచిది.