Guava | మనకు ఏడాది పొడవునా దాదాపుగా అన్ని సీజన్లలోనూ చాలా వరకు పండ్లు అందుబాటులో ఉంటాయి. కానీ అలాంటి పండ్లను మనం సరిగ్గా తినడం లేదు. వాటిల్లో జామ పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఇవి మనకు ఏ సీజన్లో అయినా సరే లభిస్తాయి. అయితే కొందరు జామ పండ్లను ఇష్టంగానే తింటుంటారు. కానీ వీటిని అధిక శాతం మంది అంతగా పట్టించుకోరు. వాస్తవానికి జామ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. జామ పండ్లను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే రోజుకు కనీసం ఒక్క జామ పండును అయినా తింటే ఎన్నో లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జామ పండ్లను రోజూ తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. మనం తినే ఆహారంలో ఉండే ఐరన్ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. జామ పండ్లలో ఫైంర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. విరేచనాల నుంచి ఉపశమనం అందిస్తుంది. విరేచనాలు అవుతున్న వారు జామ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. ఇక అధిక బరువును తగ్గించడంలోనూ జామ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. జామ పండ్లలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో జామ పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. ఈ పండ్లలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్)ను పెంచుతాయి. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జామ పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోజూ ఒక జామ పండును తింటుంటే కళ్లద్దాలను తీసి పడేస్తారు. గర్భంతో ఉన్న మహిళలు జామ పండ్లను తింటే ఎంతగానో మేలు జరుగుతుంది. దీని వల్ల ఫోలేట్ లభిస్తుంది. ఇది శివువు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడుతుంది.
జామ పండ్లలో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై వచ్చే దద్దుర్లు, దురదలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. అదేవిధంగా జామ పండ్లను తినడం వల్ల షుగర్ లెవల్స్ను తగ్గించుకోవచ్చు. జామ పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే షుగర్ లెవల్స్ అంత త్వరగా పెరగవు. పైగా ఈ పండ్లలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్ను తగ్గించేందుకు సహాయం చేస్తుంది. అయితే జామ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ లెవల్స్ మరీ తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక లో షుగర్ సమస్య ఉన్నవారు ఈ పండ్లను తినకపోవడమే మంచిది. ఇక వీటిని తింటే శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. జామ పండ్లు సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్లా పనిచేస్తాయి. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా జామ పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.