Grapes | మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. చలికాలంలో ఇవి మనకు విరివిగా లభిస్తుంటాయి. ముఖ్యంగా ఆకుపచ్చ, నలుపు రంగుల్లో ఉండే ద్రాక్షలను చాలా మంది తింటుంటారు. అలాగే ఎరుపు రంగులో ఉండే ద్రాక్ష కూడా మనకు లభిస్తుంది. అయితే ద్రాక్ష పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ద్రాక్ష పండ్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి. వ్యాధుల నుంచి రక్షణ అందిస్తాయి. కనుక ద్రాక్ష పండ్లను రోజూ తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్ష పండ్లలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. అలాగే కాటెకిన్స్, యాంథో సయనిన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. కనుక ద్రాక్ష పండ్లను తింటే ఇవి మనకు లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలను డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ పండ్లను తింటే పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. హైబీపీ ఉన్నవారికి ద్రాక్ష పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి కండరాల పనితీరును సరిచేస్తాయి. దీంతో శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి.
ద్రాక్ష పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ను తగ్గిస్తుంది. ద్రాక్ష పండ్లలో విటమిన్ కె కూడా అధికంగానే ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా చూసుకోవచ్చు. దీని వల్ల గుండె సైతం ఆరోగ్యంగా ఉంటుంది. ద్రాక్ష పండ్లలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ద్రాక్ష పండ్లలో మెలటోనిన్ అధికంగా ఉంటుంది. ఇది ఒక హార్మోన్. నిద్రను నియంత్రిస్తుంది. కనుక నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజూ ద్రాక్ష పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్ర పడుతుంది.
ద్రాక్ష పండ్లలో రెస్వెరెట్రాల్ అనే పాలిఫినాల్ సమ్మేళనం ఉంటుంది. ఇది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ద్రాక్ష పండ్లలో లుటీన్, జియాజాంతిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కెరోటినాయిడ్స్ జాబితాకు చెందుతాయి. ఇవి కళ్లను సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల బారి నుంచి రక్షిస్తాయి. దీంతో కళ్లు సురక్షితంగా ఉంటాయి. ఇలా ద్రాక్ష పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.