Digital Eye Strain | ప్రస్తుతం చాలా వరకు ఉద్యోగాలు కంప్యూటర్లపై పనిచేసేవే ఉంటున్నాయి. గంటల తరబడి కంప్యూటర్లపై పనిచేయాల్సి రావడంతో ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా కంప్యూటర్ స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కారణంగా కళ్లపై తీవ్ర ఒత్తిడి పెరిగి డిజిటల్ ఐ స్ట్రెయిన్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వంటి వ్యాధులను ఎదుర్కొంటున్నారు.
కంప్యూటర్ స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కంటిపై పడగానే దానికి తగినట్లుగా కళ్లు చూపును సర్దుబాటు చేసుకుంటాయి. దాంతో కాంతి రెటినాపై సక్రమంగా పడి వస్తువులను స్పష్టంగా చూడగలుగుతాం. అయితే, ఎక్కువ సమయం పాటు కంప్యూటర్పై పనిచేయాల్సి వచ్చినప్పుడు కంటి కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా తలనొప్పి, కళ్లు పొడిబారటం, చూపు మందగించడం, చదివేప్పుడు ఇబ్బంది, ఏకాగ్రత కరవవడం, తక్కువ కాంతిని కూడా తట్టుకోలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కారణాలేంటంటే..
మనం సాధారణంగా నిమిషానికి 15-20 సార్లు రెప్పవేయడం వల్ల కన్నీటి గ్రంథులు సక్రియమవుతాయి. ఇవి కళ్లను తేమగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కంప్యూటర్ స్క్రీన్పై ఎక్కువ సమయం పాటు కంటి రెప్ప వేయకుండా చదవడం, ఆడుకోవడం లేదా ఏదైనా పని చేయడం వల్ల కళ్ళు చికాకు లేదా పొడిబారతాయి. అలాగే, మినుకు మినుకుమనే టెక్స్ట్, స్క్రీన్ గ్లేర్, స్క్రీన్ కలర్కి వ్యతిరేకంగా టెక్స్ట్ కాంట్రాస్ట్ స్క్రీన్ కళ్ళకు కారణమవుతాయి. సాధారణంగా ఇది అధిక సమయంపాటు స్క్రీన్పై పనిచేయడం వల్ల సంభవించే సిండ్రోమ్లలో ఒకటి. డిజిటల్ స్క్రీన్లపై ఎక్కువ సమయంపాటు గడిపే ఐటీ పరిశ్రమలోని వారికి వృత్తిపరమైన ప్రమాదంగా కూడా ఈ వ్యాధిని పరిగణిస్తున్నారు.
నివారణ ఇలా..
ఒకే తీరుగా కంప్యూటర్పై ఎక్కువ సమయం పని చేయకుండా చూసుకోవాలి.
పనిచేస్తున్నప్పుడు ఎక్కువ సార్లు కంటి రెప్పలు వేస్తుండాలి.
కంప్యూటర్ స్క్రీన్ను ముఖానికి కనీసం ఒక చేయి దూరంలో ఉంచుకోవాలి.
స్క్రీన్ మధ్యలో తప్పనిసరిగా కళ్ల స్థాయికి 10-15 డిగ్రీలు తక్కువగా ఉండాలి.
కాంతిని తగ్గించేందుకు స్క్రీన్ మ్యాట్తో కప్పిపెట్టాలి.
స్క్రీన్లు గ్లేర్ కాకుండా జాగ్రత్త పడాలి.
20-20-20 రూల్ పాటించాలి.. అంటే 20 నిమిషాలకోసారి విశ్రాంతి తీసుకుని 20 అడుగుల దూరంలోని వస్తువులను 20 సెకండ్లపాటు చూస్తుండాలి.
పనిచేసే గదిలో ఎక్కువ లైట్ ఉండేలా చూసుకోవాలి.
వీలైతే బ్లూ లైట్ కళ్లద్దాలు ధరించాలి.
రాత్రి వేళ మంచంపై పడుకుని గాడ్జెట్స్ చూసే అలవాటు మానుకోవాలి.
కంటి చూపులో సమస్యలు ఎదురైతే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
చికిత్స ఇలా..
కంటి మంటను తగ్గించుకునేందుకు సహజ ఉత్పత్తులను వాడాలి.
విటమిన్లు, లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి.
ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహారాలను తింటూ ఉండాలి.
కళ్లు పొడిబారకుండా ఉండేందుకు కంటి వ్యాయామాలు చేయాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.