Physical Activeness | కాలమాన మార్పుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు భవిష్యత్తులో మనిషి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2050 నాటికి పెరుగుతున్న వేడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శారీరక చురుకుదనం కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడైంది. ఈ అధ్యయనం అంచనా ప్రకారం అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రతి సంవత్సరం అదనంగా సుమారు 7 లక్షల ముందస్తు మరణాలు సంభవించే అవకాశం ఉంది. అలాగే ఉత్పాదకతలో సుమారు 3.68 బిలియన్ డాలర్ల నష్టం కలగవచ్చని పేర్కొంది. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన శారీరక చురుకుదనాన్ని 2030 నాటికి 15 శాతం పెంచాలన్న లక్ష్యానికి ఇది పెద్ద అడ్డంకిగా మారవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
లాటిన్ అమెరికా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, ముఖ్యంగా అర్జెంటీనాలోని పాంటిఫికల్ కాథలిక్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భారత్ పరిస్థితిని కూడా విశ్లేషించారు. తక్కువ ఉద్గారాలు, ప్రస్తుత ధోరణులు అలాగే కొనసాగడం, అధిక ఫాసిల్ ఇంధన వినియోగం వంటి మూడు భవిష్యత్ పరిస్థితుల్లో 2050 నాటికి భారత్లో శారీరక చురుకుదనం లోపంతో ప్రతి లక్ష మందికి సుమారు 10.62 మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం మరింత వేడెక్కుతోంది. ఈ పెరుగుతున్న వేడి మనుషులు వ్యాయామం చేయగల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాల్లో అత్యధిక వేడి, తేమ ఉన్న సమయాల్లో యువత, వృద్ధులు సురక్షితంగా శారీరక కార్యకలాపాలు చేయలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూర్చోవడం లేదా పడుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది.
ప్రస్తుతం కూడా శారీరక చురుకుదనం లోపం ఒక ప్రధాన ప్రపంచ ఆరోగ్య సమస్యగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు వారానికి అవసరమైన వ్యాయామ ప్రమాణాలను చేరుకోలేకపోతున్నారు. WHO సూచనల ప్రకారం 18-64 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలి. అలాగే వారానికి కనీసం రెండు రోజులు కండరాల బలపరిచే వ్యాయామాలు చేయాలని సూచిస్తోంది. 2000 నుంచి 2022 వరకు 156 దేశాల డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం, 2050 వరకు ఉష్ణోగ్రతల ప్రభావాన్ని అంచనా వేసింది. దీని ప్రకారం, సగటు ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉన్న ప్రతి అదనపు నెలకు ప్రపంచవ్యాప్తంగా శారీరక చురుకుదనం లోపం 1.5 శాతం పెరగనుంది. తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లో ఇది 1.85 శాతం వరకు పెరగవచ్చని అంచనా.
2050 నాటికి ఈ పరిస్థితులు 4.7 లక్షల నుంచి 7 లక్షల వరకు అదనపు మరణాలకు దారి తీసే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది మరింత ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. ఈ సమస్యకు పరిష్కారంగా పలు చర్యలను కూడా పరిశోధకులు సూచించారు. వ్యాయామ మార్గదర్శకాల్లో వేడి ప్రమాదాలపై అవగాహన కల్పించడం, నీడ కలిగిన నడక మార్గాలను అభివృద్ధి చేయడం, ప్రమాదంలో ఉన్న వర్గాల కోసం చల్లని వ్యాయామ సదుపాయాలను అందుబాటులోకి తేవడం, ఉద్యోగ స్థలాల్లో వేడి భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం వంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు. శారీరక చురుకుదనం లోపాన్ని కేవలం జీవనశైలి ఎంపికగా కాకుండా, వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో హృదయ సంబంధిత వ్యాధులు, మెటబాలిక్ సమస్యలు పెరగడంతోపాటు ఆర్థిక నష్టాలు కూడా పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.