DK Shivakumar : కర్ణాటకలో ఎస్సీ, బీసీ, మైనారిటీల ఓట్లు తొలగించేందుకే కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ ప్రక్రియ చేపట్టబోతుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. 16 రాష్ట్రాల్లో చేపట్టనున్న మూడో దశ ‘సర్’లో భాగంగా కర్ణాటకలో కూడా ‘సర్’ ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30 నుంచి ఇక్కడ సర్ ప్రారంభమవుతుంది.
ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పదించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈసీపై, కేంద్రంపై విమర్శలు చేశారు. “కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయంలో అన్ని పార్టీల లీడర్లని చైతన్యం చేస్తున్నాం. పార్టీలతో సంబంధం లేకుండా బీజేపీ, జేడీఎస్ కూడా తమ ఓట్లను కాపాడుకోవాలి. ఎస్సీ, బీసీ, మైనారిటీల ఓట్లను తొలగించేందుకే ‘సర్’ నిర్వహిస్తున్నారు. కానీ, మేం వారి ఓట్లను రక్షిస్తాం. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కలిగి ఉండాలి. కర్ణాటకలో 88 శాతం నుంచి 90 శాతం వరకు ఓటర్లుగా గుర్తింపు కలిగి ఉన్నారు.
మేం వారందరినీ చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తాం” అని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఈ నెల 30 నుంచి కర్ణాటకతోపాటు తెలంగాణ, పంజాబ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా సర్ మొదలవుతుంది. కర్ణాటకలో ఓటర్ల తుది జాబితా వచ్చే అక్టోబర్ 7న ప్రకటిస్తారు. అయితే, ఈ ప్రక్రియను కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. ఇందుకోసం సమర్ధవంతంగా పని చేయాలని అధికారులకు సూచించారు.