ఉప్పు కలపకుండా వేయించిన పల్లీలు స్నాక్స్గా మంచి ఆహారం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ పల్లీలు తినడం వంటికి మంచిది కాదనేది ఓ అపోహ మాత్రమే! గుప్పెడన్ని తింటే సమస్యేమీ ఉండదు. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు అందుతాయి. ఇవి గుండె, చర్మం, మెదడు, హార్మోన్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హైడ్రోజినేటెడ్ కొవ్వులు, ఉప్పు, ప్రిజర్వేటివ్లు కలగలిపి మార్కెట్లో అమ్మే పల్లీలు మాత్రం ఆరోగ్యానికి హానికరం.
పల్లీల్లో ఉండే బయోటిన్ కేశాల పెరుగుదలకు మంచిది. జుట్టు రాలే సమస్య (అలోపీసియా) ఉన్నవాళ్లు రోజూ గుప్పెడన్ని పల్లీలు తింటే సరి. జింక్, విటమిన్-బి లోపాలూ తగ్గిపోతాయి.
వీటిలో కాపర్, ఫోలేట్, మాంగనీస్, ఇతర ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర పెరుగుదలకు ఉపయోగకరం. అందుకని, గర్భిణులు తరచూ పల్లీలు తినాలంటారు.
ద్రాక్ష, వైన్లో లభించే రెజ్వెట్రాల్ పల్లీల్లో ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. అలా పల్లీలు రోగ నిరోధక వ్యవస్థకు మేలుచేస్తాయి.
పల్లీల్లో ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మన శరీరం.. పోషకాలతోపాటు జింక్, ఐరన్ను గ్రహించకుండా నిరోధిస్తుంది. అందుకే వేయించి కానీ, నీళ్లలో నానబెట్టి కానీ తినాలి. ఇలా చేయడం వల్ల తేలిగ్గా అరుగుతాయి. పోషకాలు కూడా వంటబడతాయి.
సాయంత్రం అయ్యేసరికి తియ్యగా, కారంకారంగా ఏదైనా తినాలనిపిస్తుంది ఎవరికైనా. ఆ సమయానికి శరీర జీవక్రియల్లో మార్పులు రావడం వల్ల ఇలా జరుగుతుంది. దాంతో శరీరం తక్షణ శక్తిని కోరుకుంటుంది. చక్కెర స్థాయులను పెంచుకోవాలని చూస్తుంది. ఇలాంటప్పుడు జంక్ఫుడ్ కంటే వేయించిన శనగలు, పల్లీల మిశ్రమం మంచి స్నాక్స్గా పనికొస్తాయి. వీటికి మరమరాలు, కూరగాయల మిశ్రమం జోడించి భేల్గానూ
చేసుకోవచ్చు.
ఉప్పు కలిపి వేయించిన గింజలు, పల్లీలు తీసుకోవద్దు. ఇవి మెదడులో న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్తేజ పరుస్తాయి. దాంతో ఇంకా ఇంకా తినేస్తాం. అలా శరీరంలో ఉప్పు అధికంగా పేరుకుంటుంది. ఇది బీపీని పెంచుతుంది. గుండెకూ మంచిది కాదు. శరీరంలో నీరు పేరుకుపోయేలా చేస్తుంది కాబట్టి, వంటికి కూడా మేలుచేయదు.
పల్లీలు మంచివి అంటున్నామని, వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు. ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. కొంతమందిలో ఇవి అలర్జీలకు కారణమవుతాయి. ఇలాంటివారు పల్లీల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఏదైనా సరే మితమే అమృతం.