రాత్రి లైట్లు వేసుకొని పడుకునేవారు అధికంగా బరువు పెరిగిపోతున్నారట. వీరు అధిక రక్తపోటుతోపాటు మధుమేహం బారినపడతారట. ఓ తాజా అధ్యయనంలో ఈ భయంకర నిజాలు వెల్లడయ్యాయి. రాత్రిపూట లైట్ వేసుకోకుండా పడుకునే పెద్దలతో పోల్చితే లైట్ వెలుతురులో పడుకునే 63 నుంచి 84 ఏళ్ల మధ్య వయస్సుగల వృద్ధులు, స్త్రీలలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. చేతి మణికట్టుకు ధరించే పరికరంతో వారు కాంతికి ఎక్స్పోస్ అయ్యే సమయాన్ని పరిశోధకులు ట్రాక్ చేశారు. ఈ అధ్యయనాన్ని నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించారు.
ఇది ప్రయోగాత్మకంగా చేసిన అధ్యయనం కాదు. వాస్తవ అధ్యయనం. కొంతమంది వ్యక్తుల నిజజీవితాలను పరిశీలించి చేసిన పరిశోధన. రాత్రిపూట ఏదైనా కాంతిలో పడుకునే వృద్ధులు ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం బారినపడుతున్నట్లు తేలింది. ఈ అధ్యయన ఫలితాలు ఈ నెల 22న జర్నల్ స్లీప్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న 552 మందిలో సగంకంటే తక్కువ మంది రోజుకు 5 గంటలు పూర్తి చీకటిలో పడుకున్నారు. మిగిలినవారు ఐదుగంటలు లైట్ వెలుతురులో నిద్రపోయారు. లైట్ వెలుతురులో నిద్రపోయినవారిలో ఊబకాయంతోపాటు మధుమేహం, అధిక రక్తపోటును పరిశోధకులు గుర్తించారు.
నిద్రపోయే ముందు అందరూ లైట్లు తప్పనిసరిగా ఆర్పేయాలని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు డాక్టర్ ఫిల్లిస్ జీ తెలిపారు. ఒకవేళ లైట్ వెలుగులో నిద్రపోవాల్సి వస్తే ఎరుపు/నారింజ రంగు లైట్లు వాడాలని, ఇవి మెదడుకు తక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తాయని తెలిపారు. తెలుపు లేదా నీలం కాంతికి దూరంగా ఉండాలని సూచించారు. అవుట్డోర్ లైట్ని కంట్రోల్ చేయలేకపోతే బ్లాక్అవుట్ షేడ్స్ లేదా ఐ మాస్క్లను వాడాలని చెప్పారు.