Diabetes and Non-Veg | డయాబెటిస్.. సైలెంట్గా మనలో ప్రారంభమై.. మనల్ని ఇబ్బందిపెడుతుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధిగా గురవుతున్నవారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ఎవరిని పలకరించినా షుగర్ ఉందని చెప్తున్నారు. మన జీవనశైలి, ఆహారపుటలవాట్లే ఈ వ్యాధి బారిన పడటానికి ప్రధాన కారణాలని వైద్యులు సెలవిస్తున్నారు. ఒక్కసారి ఈ వ్యాధికి గురైతే దీన్ని అదుపులో పెట్టుకోవడమే కానీ పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. చక్కని జీవనవిధానంతోపాటు ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే కొంతవరకు నియంత్రణలో పెట్టుకోవచ్చు.
చాలా మంది డయాబెటిక్ పేషెంట్లలో ఏఏ ఆహారం తీసుకోవాలి..? వేటిని దూరం పెట్టాలి..? అనే విషయాల్లో బోలెడు సందేహాలున్నాయి. అలాగే, షుగర్ ఉన్నవారు తీపి పదార్థాలు తినొచ్చా..? మటన్, చేపలు వంటి నాన్-వెజ్ తింటే ఏమైనా సమస్యలు వస్తాయా..? అనేదానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చికెన్, మటన్, చేపలు ఏదైనా మన వద్ద వండుకుని తినే విధానం ఒకే మాదిరిగా ఉంటుంది. వీటన్నింటి తయారీలోనూ మనం ఎక్కువగా నూనె వాడుతుంటాం. అందుకని మటన్ మంచిది కాదు, చికెన్ మంచిది అని అనుకోవద్దు. మధుమేహం ఉన్నవారు, లేనివారు ఓ వయసు వచ్చాక నాన్ వెజ్ తినకపోవడమే చాలా ఉత్తమం. చికెన్, చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్నా వండేటప్పుడు నూనె ఎక్కువగా వాడటం వలన అవి నూనెను పీల్చుకుని హాని కలిగించే కొవ్వు పదార్థంగా తయారవుతుంది. రొయ్యలు, చేపల శరీరాల్లో ఎక్కువగా నీరుండి వండేటప్పుడు ఈ నీరంతా పోయి అవి నూనెను బాగా పీల్చుకుంటాయి. మాంసంలో కండరాల పోగుల మధ్య కొవ్వు పేరుకుపోతుంది. దీన్ని తొలగించడం సాధ్యం కాదు. ఏ మాత్రం నూనె లేకుండా గ్రిల్ చేసిన చికెన్ తినడం కొంత వరకు మేలు అని చెప్పుకోవచ్చు. అలాగే, మేక మెదడులో కూడా కొవ్వులు అధికంగా ఉంటున్నందున వాటి జోలికి వెళ్లకుండా ఉండటం బెటర్
చక్కెర వ్యాధిగ్రస్తులు నట్స్, డ్రైఫ్రూట్స్ తీసుకోవచ్చా..? అనేది కూడా పెద్ద సందేహమే. పల్లీలు, అక్రోట్, బాదాం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్లో దాదాపు 80 శాతం వరకు నూనెలుంటాయి. అందుకని మధుమేహులు వీటిని తినకుండా ఉండటమే ఉత్తమం. అయితే ఏ వంటకాన్ని తీసుకున్నా పరిమితంగా తీసుకోవడం ఉత్తమమని వారు చెపుతున్నారు. అతిగా తింటే మాత్రం సమస్య మరింత పెరుగుతుందని చెప్తున్నారు.